నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ సిటీ: పసుపు ధర రోజురోజుకూ పడిపోతున్నది. పంట మార్కెట్కు చేరుతున్న తరుణంలో మద్దతు ధర లేక రైతులకు నిరాశే ఎదురవుతున్నది. మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ రూ.10 వేలైనా వస్తుందని రైతులు భావించారు. అది కాస్త రూ.5 వేల దిగువకు చేరడంతో గందరగోళం నెలకొన్నది. శుక్రవారం నిజామాబాద్ మార్కెట్లో క్వింటాల్కు కనిష్ఠంగా రూ.4,500, గరిష్ఠంగా రూ.6,600 మాత్రమే పలికింది. జనవరి 27న ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేటకు వచ్చిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అర్వింద్.. తమ మూలంగానే పసుపు క్వింటాల్కు రూ.10 వేల వరకు ధర లభిస్తుందన్నారు. బీజేపీ సోషల్ మీడియా వేదికలోనూ రూ.10 వేలకు మించి ధర వస్తున్నదని ప్రచారాలు ఊదరగొట్టారు. మార్కెట్లో మాత్రం రూ.5 వేలు కూడా పలుకట్లే దని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మద్దతు ధర కల్పించాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు నిజామాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం ధర్నా చేశారు.