ముకరంపుర, ఆగస్టు 12: కరీంనగర్ శివారు రేకుర్తి పరిధిలోని 18వ డివిజన్ (ద్వారకానగర్)లో గుడ్డెలుగు(భల్లూకం) సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శనివా రం తెల్లవారుజామున కాలనీ వీధుల్లో సంచరించడాన్ని ప్రజలు గమనించారు. విషయాన్ని స్థానిక కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణాగౌడ్కు వివరించగా.. అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ శాఖ కరీంనగర్ రేంజ్ అధికారి గంటల శ్రీనివాస్రెడ్డి సిబ్బందితో రంగంలోకి దిగారు. రేకుర్తి చౌరస్తాలోని ప్రధా న రహదారిపైకి వేగంగా పరుగెత్తుకుం టూ రావడంతో వాహనదారులు, ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అటు నుంచి నేరుగా సమ్మక్క-సారలమ్మ గద్దెలకు వెళ్లే మార్గం వైపునకు పరుగులు పెట్టింది. అక్కడి నుంచి సబ్స్టేషన్ ప్రాంగణలోకి చేరింది.
ఇంతలో వన్య ప్రాణుల రక్షణ వాహనంతో రెస్క్యూ సిబ్బంది రేకుర్తికి చేరుకున్నారు. అతికష్టం మీద గుడ్డెలుగుకు మత్తు మందు ఇవ్వడంతో సమ్మక్క-సారలమ్మ గుట్ట వైపునకు పరుగులు తీసి.. పొదల మధ్య స్పృహ తప్పి పడిపోయింది. రెస్క్యూ సిబ్బంది గుడ్డెలుగును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అటవీ శాఖకు చెందిన వన్య ప్రాణుల రక్షణ వాహనంలో భూపాలపల్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు. గుడ్డెలుగును సురక్షితంగా పట్టుకునేందుకు అధికారులు, సిబ్బందికి ఎఫ్వో బాలమణి సూచనలు చేస్తూ పర్యవేక్షించారు. తెల్లవారు జాము నుంచి కొనసాగిన ఆపరేషన్ మధ్యాహ్నానానికి ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.