హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్కు పంపినట్లు మోత్కుపల్లి తెలిపారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ అవినీతిపరుడు అని ధ్వజమెత్తారు. ఈటలకు అంత ఆస్తి ఎలా వచ్చింది? ఈటలను హుజురాబాద్ ప్రజలు బహిష్కరించాలి అని పిలుపునిచ్చారు. ఈటలను బీజేపీలో చేర్చుకోవడం బాధించింది. దళితుల భూములను వాపస్ ఇవ్వాలని మొదట్నుంచి చెబుతున్నాను. ఒక వ్యక్తిని పార్టీలో చేర్చుకునే ముందు ఆ వ్యక్తి క్రెడిబిలిటీ చూడాలి. ఈటల మీద ఎందుకు సానుభూతి చూపాలి? ఆయనను బీజేపీ నెత్తిమీద మోయాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. బీజేపీలో పని చేసే అవకాశం తనకు ఇవ్వలేదు. తాను ఎప్పుడు వెళ్లినా కింద కూర్చునే పరిస్థితి. పార్టీలో ఎలాంటి ప్రోటోకాల్ లేదు. 30 ఏండ్లుగా ఎమ్మెల్యేగా పని చేసిన తనకు బీజేపీ నాయకులు ఎలాంటి గౌరవం ఇవ్వలేదు అని మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు.