హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ జాబ్స్, లోన్ యాప్స్ పేరుతో మోసాలు.. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ స్కామ్లు.. ఫెడెక్స్లో డ్రగ్స్ స్మగ్లింగ్ అంటూ బెదిరింపులు, సైబర్ దాడుల బారిన పడి నిత్యంత ఎంతో మంది అల్లాడుతున్నారు. ఇలాంటి నేరాలకు సంబంధించి రోజూ సగటున దేశవ్యాప్తంగా 6,200 కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 85% ఆర్థిక నేరాలే. ఇందులో సగం మోసాలు ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే జరుగుతున్నాయని, వాటిలో కంబోడియా అగ్రస్థానంలో ఉన్నదని ఐ4సీ (ఇండియన్ సైబర్క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్) గుర్తించింది. విదేశీ ఉద్యోగాల పేరుతో చాలా ఏజెన్సీలు భారత్లోని ఎంతో మంది నిరుద్యోగ యువతను నమ్మించి కంబోడియాకు తీసుకెళ్తున్నాయి. అనంతరం సైబర్ నేరాల్లో వారికి శిక్షణ ఇప్పించి వాట్సాప్ సందేశాలు, ఫోన్స్కాల్స్తో భారత్లోని ఎంతో మందిని మోసగిస్తున్నాయి. తద్వారా రాబట్టిన సొమ్ములో 1 శాతాన్ని ఆ సైబర్ నేరగాళ్లకు జీతంగా చెల్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి చెందిన కొందరు వారం రోజుల క్రితం కంబోడియా నుంచి తప్పించుకుని వచ్చి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఇచ్చిన సమాచారం ఆధారంగా కంబోడియా పోలీసులు పలు కన్సల్టెన్సీల నిర్వాహకులను అరెస్టు చేయడంతోపాటు విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల శాఖల అధికారులు కంబోడియా ఎంబసీతో మాట్లాడి తెలంగాణ, ఏపీకి చెందిన 360 మంది యువతను విడతలవారీగా స్వదేశానికి రప్పిస్తున్నారు.
హైదరాబాద్లోని సైబర్క్రైం పోలీసులు గతంలో ఎన్నో నేరాలను చేధించారు. లోన్ యాప్స్ సహా వివిధ మార్గాల్లో చైనీయులు ఈ నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి ఎంతో మందిని అరెస్టు చేశారు. దీంతో వారంతా తమ అడ్డాలను కంబోడియా, మయన్మార్, దుబాయ్, మలేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు మార్చి.. విదేశీ ఉద్యోగాల పేరుతో భారత యువతను అక్రమంగా తీసుకెళ్తున్నారు. కంప్యూటర్ ఉద్యోగాలంటూ కొంత జీతానికి వారితో ఒప్పందం చేసుకొంటున్నారు. ఆ తర్వాత వారికి సైబర్ నేరాలు చేయడంలో వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి, కాల్ సెంటర్ల ద్వారా భారత్లోని అమాయకులను మోసగిస్తున్నారు.
ఈ ముఠాల్లోని సభ్యులంతా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టా, ఫేస్బుక్ తదితర ప్లాట్ఫామ్స్ ద్వారా ఎంతో మందిని ఆర్థికంగా మోసగిస్తున్నారు. వీటిపై ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నేషనల్ సైబర్క్రైం పోర్టల్కు 7,40,957 ఫిర్యాదులు అందాయి. వాటిలో 46% మోసాలు ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి జరిగినట్టు గుర్తించారు.