హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): పేదల దవాఖానగా పేరు పొందిన ఉస్మానియాలో ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే దవాఖానలో క్యాథ్ల్యాబ్, స్కిన్బ్యాంక్, సీటీ-స్కాన్ వంటి అధునిక వైద్య సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం, మరో రూ.5.95 కోట్లతో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం దవాఖానలో 300 వరకు ఐసీయూ పడకలు అందుబాటులో ఉండగా, రూ.3.5 కోట్లతో మరో 75 పడకలతో కొత్త వార్డును ఏర్పాటుచేస్తున్నారు. వారంపది రోజుల్లో ఇది అందుబాటులోకి వస్తుందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ తెలిపారు.
మరో మూడు ఆపరేషన్ థియేటర్లు కూడా నిర్మించినట్టు చెప్పారు. వీటిలో ఒకటి కాలేయ మార్పిడికి, మరొకటి ఇతర కాలేయ సంబంధిత శస్త్ర చికిత్సలకు, మూడోదానిని కిడ్నీ మార్పిడి చికిత్సలకు కేటాయించనున్నారు. ఉస్మానియాకు రోజూ రెండుమూడు వేలమంది రోగులు ఓపీ సేవల కోసం వస్తుంటారు. ప్రస్తుతం ఉన్న ఓపీ రిజిస్ట్రేషన్ విభాగం ఇరుకుగా ఉండటంతో రోగల రద్దీకి సరిపోవడం లేదు. దీంతో రూ.75 లక్షలతో ఈ విభాగాన్ని విస్తరించనున్నారు. ఓపీ రోగులకు ఉచితంగా అందించే ఫార్మసీ కౌంటర్లు కూడా మరో నాలుగు పెంచారు. వారంలోగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఖులీ కుతుబ్షా భవనంలోని లిఫ్ట్లు రోగుల రద్దీకి సరిపోకపోవటంతో క్యూక్యూ భవనంలో మరో రెండు లిఫ్ట్లను 5వ అంతస్తు వరకు ఏర్పాటు చేశారు.
రోగులకు మరిన్ని సేవలు
ఉస్మానియాలో రోజూ వచ్చే ఓపీ రోగుల సంఖ్య రెండువేలు దాటుతున్నది. ఐపీ కేసులు కూడా అధికంగానే ఉంటున్నాయి. ఈ రద్దీకి తగినట్టుగా దవాఖానలో అదనపు ఏర్పాట్లు చేస్తున్నాం. మార్చురీ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. మూడు కొత్త ఆపరేషన్ థియేటర్లను వారంలో అందుబాటులోకి తెస్తాం. ప్రైవేటు కార్పొరేట్ దవాఖానలో కూడా అందని వైద్యం ఉస్మానియాలో అందిస్తున్నాం.
–డాక్టర్ బీ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా దవాఖాన