హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న బీజేపీ నేతల ప్రకటనలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ను ముట్టుకొంటే ఢిల్లీలో మోదీ గద్దెను బద్దలు కొడతామని హెచ్చరించారు. దమ్ముం టే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని సవాల్ విసిరారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జలవిహార్లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు. వారి మాట వినని ప్రభుత్వాలను పడగొడుతున్నారు. మోదీ వద్ద శిక్షణ తీసుకొన్న ఓ గొప్ప కేంద్ర మంత్రి హైదరాబాద్లో కూర్చొని మహారాష్ట్రలో మాదిరిగానే తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని కూల్చుతామంటున్నారు. సరే మంచిది పడగొట్టండి! మేం కూడా వేచి చూస్తున్నాం.
ఢిల్లీలో మిమ్మల్ని కూడా గద్దె దింపుతాం. ఎప్పుడైనా ఘర్షణలే కొత్త వెలుగుకు దారి చూపిస్తాయి. తెలంగాణ ప్రజలు తమ ఆస్తిత్వం కోసం 60 ఏండ్లు పోరాటం చేశారు. దేశం కోసం మరో పోరాటం చేయాల్సి వస్తే అందుకూ సిద్ధంగానే ఉన్నారు. తెలంగాణలోని 119 ఎమ్మెల్యే సీట్లలో టీఆర్ఎస్ సొంతంగా 88 గెలుచుకొన్నది. టీఆర్ఎస్కు, మిత్రపక్షానికి కలిపి 104 సీట్లు ఉన్నాయి.
దేశంలో చిన్న ఉద్యోగాలు చేసుకొనేవాళ్లు కోట్ల మంది ఉన్నారు. బీజేపీ నేతలు వీరి మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మోదీ.. దేశానికి ఇది మంచిదా? మోదీ నిర్ణయాలు, విధానాలు, విభజన రాజకీయాలు, విద్వేషాల వల్ల అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్ఠ మసకబారుతున్నది. భారతదేశం ప్రాథమిక సూత్రమే ‘జీవించు.. జీవించనివ్వు’. ఇప్పుడు ఈ సూత్రాన్నే మార్చేశారు. ప్రజల జీవించే హక్కును హరిస్తున్నారు. దేశం కోసం మోదీ ఏం కలలు కన్నారు? ఏం సాధించారు? మోదీ ప్రభుత్వం సెస్ పేరుతో రాష్ర్టాల నుంచి పన్నులు వసూలు చేసి రాష్ర్టాలకు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నది.
ఇలా ఎగ్గొట్టిన సొమ్ము రూ.30 లక్షల కోట్లు. చివరకు మోదీ పాలనలో జాతిపిత మహాత్మాగాంధీకి కూడా అవమానాలు తప్పడం లేదు. మోదీ తెలివితక్కువ తనంతో అమెరికా ఎన్నికల్లో తలదూర్చి ట్రంప్కు మద్దతుగా ప్రచారం చేశారు. ట్రంప్ ఓడిపోయారు. మరి భారత్ ఎటు పోవాలి? ఏ దేశ ప్రధాని అయినా ఇలాంటి తప్పిదం చేశారా? అవేమైనా అహ్మదాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు అనుకున్నారా?
అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠను దిగజార్చినందుకు దేశ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలి. మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి దేశంలోని పేద ప్రజల కోసం ఉపవాసం ఉన్నారు. ఓ పూట భోజనం మానేసి.. పేదలకు పెట్టాలని ధనవంతులకు పిలుపునిచ్చారు. ఆయన మహానేత. మరి మీరు ఎలాంటి వారు? లోపల ఒకలా ఆలోచిస్తూ.. పైకి నాటకాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.