హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): అవమానకరరీతిలో ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణను ఏర్పాటుచేశారని విషం కక్కిన మోదీ, తన వ్యతిరేకతను కొనసాగిస్తూ శత్రువులాగ వ్యవహరిస్తున్నారు. ఆనాడు కాంగ్రెస్ పద్ధతి ప్రకారం విభజన చేయకపోవడంతో నేటికీ రెండు రాష్ర్టాల మధ్య సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ భగ్గుమనడంతో, హఠాత్తుగా సమస్యల పరిష్కారానికి పూనుకున్నట్టుగా కేంద్రం కలరింగ్ ఇచ్చింది. విభజన సమస్యలపై 17న చర్చిస్తామని కేంద్ర హోంశాఖ 9 అంశాలతో ఎజెండా కూడా విడుదల చేసింది. శనివారం ఎజెండాను 5 అంశాలకే కుదించింది. ఇందులో తొలుత చేర్చిన ఏపీకి ప్రత్యేక హోదా, రెవెన్యూలోటును తొలగించింది. ఇప్పటివరకు కేంద్రం దృష్టికి తెలంగాణ తీసుకెళ్లిన ఒక్క అంశాన్ని కూడా ఎజెండాలో చేర్చలేదు. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు రెండేండ్ల బకాయిలు రూ.900 కోట్లు రావాల్సి ఉన్నది. వీటితోపాటు పన్ను రాయితీలను కొత్త జిల్లాలకూ విస్తరించి, మరో ఐదేండ్లు పొడిగించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని ఎజెండా నుంచి తొలగించారు. రాష్ట్ర విభజన నాటినుంచి ఏపీ, తెలంగాణ మధ్య పలు అపరిష్కృత సమస్యలున్నాయి. ప్రత్యేకించి 9, 10 షెడ్యూళ్లలోని వందకుపై సంస్థల విభజనను తేల్చలేదు. సమస్యలను మరింత సాగదీసేందుకే ఎజెండాను కుదించిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
వివక్షకు బడ్జెటే సాక్ష్యం
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ర్టాల పట్ల ఎంతటి వివక్ష చూపుతున్నదనేదానికి కేంద్ర బడ్జెటే సాక్ష్యమని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ రెండు రాష్ర్టాలకు కేంద్రం రిక్త హస్తమే చూపిందని గుర్తుచేస్తున్నారు. ప్రతి బడ్జెట్లోనూ ఇదే వివక్ష కనపడుతున్నదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన డిమాండ్ అయిన కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఆంధ్రప్రదేశ్ కోరుతున్న ప్రత్యేక హోదా డిమాండ్ను కేంద్రం కనీసం పట్టించుకోవటంలేదు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ సహాయం చేస్తారని గంపెడాశలు పెట్టుకుంటే తట్టెడు మట్టి, చెంబెడు నీళ్లు తప్ప ఏమీ రాలేదు. పైసా సాయం చేయకపోగా ప్రధాని మోదీ పదేపదే రాష్ట్ర విభజన అంశాన్ని లేవనెత్తి రెండు రాష్ర్టాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని తెలుగు మేధావులు మండిపడుతున్నారు.
త్రిసభ్య కమిటీ
తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం ముగ్గురు అధికారులతో సబ్కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈనెల 17 ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ర్టాలకు కేంద్రం నోటీసు అందజేసింది. ప్రతినెలా ఒకసారి సబ్కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ సభ్యులుగా ఉంటారు.
మొదటి నుంచీ శత్రువైఖరే
రాష్ర్టాల మధ్య ఏదైనా సమస్య వస్తే పెద్దన్న పాత్ర పోషించి పరిష్కరించాల్సిన కేంద్రప్రభుత్వం, ప్రధానమంత్రి.. తెలుగు రాష్ర్టాల విషయంలో బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎనిమిదేండ్ల పాలనలో ప్రధాని మోదీ తెలుగు రాష్ర్టాలకు శత్రువుగా మారారా! అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రెండు రాష్ర్టాలకు బీజేపీ ప్రభుత్వం ఇన్నేండ్లలో ఏమిచ్చిందని భూతద్దం పెట్టి వెతికినా ఏమీ కనిపించదని తెలుగు మేధావులు అంటున్నారు. కేంద్రం ఏ పథకం చేపట్టినా, ఏం సంస్థలను స్థాపించాలని నిర్ణయించినా అవి గుజరాత్కో, ఇతర బీజేపీ పాలిత రాష్ర్టాలకో వెళ్తాయే తప్ప ఒక్కటీ మనకు రావని అంటున్నారు. విభజన హామీల పరిష్కారంపై కూడా కేంద్రం ఇదే వైఖరి అవలంభిస్తున్నది. ఈ నెల 17న విభజన హామీలపై కేంద్ర హోం శాఖ నిర్వహించనున్న అజెండా నుంచి కీలక అంశాలను తొలగించడంతో తెలుగు రాష్ర్టాలపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో మరోసారి తేటతెల్లం అయిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
తొలుత ప్రకటించిన ఎజెండా
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, విద్యుత్తు సమస్యలు, పన్నులు, బ్యాంక్ డిపాజిట్ల పంపకాలు, వనరుల సర్దుబాటు, 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సాహకాలు, వనరుల వ్యత్యాసానికి సంబంధించిన అంశాలు.
సవరించిన ఎజెండా
ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ జెన్కో, తెలంగాణ డిస్కంల మధ్య విద్యుత్తు బకాయిల వివాదం, పన్ను విధానంలో ఉన్న వ్యత్యాసాల తొలగింపు, నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన, ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ నగదు నిల్వల అంశాలు.