ప్రధానిగా దేశానికి చేసిందేమీ లేదు
దేశ ప్రతిష్ఠను మరింత దిగజార్చారు
8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలదోయలేదా?
నిరుద్యోగులు జాబ్ సెక్యూరిటీ కోరితే..
అగ్నిపథ్తో సెక్యూరిటీగార్డు జాబ్ ఇస్తారా?
రాష్ట్రంలో మూడు రోజుల బీజేపీ సర్కస్
అన్ని నియోజకవర్గాల్లో అబద్ధాల జాతర
ఆ సిపాయిలకు రాష్ట్ర అభివృద్ధిని చూపండి
జాతి నిర్మాణంలో తెలంగాణ చెమట, రక్తం
మోదీ తెలంగాణ ప్రజలకు దండం పెట్టాలి
బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
కారెక్కిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు
అదేబాటలో తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్
మోదీ పాలనలో 30 ఏండ్లల్లో ఎన్నడూలేని ద్రవ్యోల్బణాన్ని చవిచూశాం. 45 ఏండ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత రేటు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటగ్యాస్ సిలిండర్ ధర పెరిగింది ఇంత అసమర్థ ప్రధాని అవసరమా? నిజమైన దొర…నిజమైన నియంత మోదీయే. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసినోడు నియంతనా? లేక మీరు తిట్టిన తిట్లన్నీ మౌనంగా భరిస్తున్న కేసీఆర్ నియంతనా? – మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వేదికగా 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోదీ హైదరాబాద్ రానుండగా, సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరడంతో బీజేపీకి ఊహించని షాక్ గురైంది. బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్లో చేరారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, ఏడుగురు కౌన్సిలర్లు సహా వందల మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 200 వాహనాల్లో వచ్చి టీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్లో తెలంగాణభవన్, నందినగర్లో వేర్వేరు వేదికలపై పార్టీలో చేరిన వారికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మోదీ ప్రధానిగా దేశానికి చేసిందేమీలేదని, బైబై మోదీ అని చెప్పే టైమొచ్చిందని అన్నారు.
మోదీకి టాటా చెప్పాలని పిలుపునిచ్చారు. దేశానికి, రాష్ర్టానికి మోదీ ఏం చేశారని నిప్పులు చెరిగారు. రెండు మూడురోజుల పాటు రాష్ట్రంలో బీజేపీ సర్కస్ నడుస్తదని ఆ పార్టీ కార్యవర్గ సమావేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘రేపటి నుంచో ఎల్లుండి నుంచో మోదీ హైదరాబాద్లో దుకాణం చాలూ చేస్తున్నాడు. బీజేపీ సర్కస్లో పచ్చి అబద్ధాలు చెప్తరు. బీజేపీ వాళ్లు ఒక్క నిజం చెప్పినా తల వేయి వక్కలవతని మునిశాపం పెట్టిండు. అందుకే ఆ పార్టీ నేతలు నిజం చెప్పరు. ఝూటా మాటలు.. బక్వాస్ మాటలు.. పచ్చి అబద్ధాలు చెప్పటమే వాళ్ల విధానం. ఏదో పీకేస్తం.. నాలుగు బొమ్మలు పెట్టి ఏదో నరికేస్తమనే నేతలు హాయిగా వచ్చి హైదరాబాద్ బిర్యానీ తిని..ఇరానీ చాయ్ తాగి పోవాలి’అని సూచించారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏవి?
దేశ యువత జాబ్ సెక్యూరిటీ కావాలని కోరితే, అగ్నిపథ్ పేరుతో సెక్యూరిటీ గార్డుజాబ్స్ ఇస్తామంటరా? అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. నాలుగేండ్లు ఆర్మీలో పనిచేశాక, ఏటీఎం బయట యూనిఫాం వేసి నిలబెడతానని మోదీ చెప్తున్నారని.. ఇదేనా మోదీ నుంచి దేశ యువత కోరుకుంటున్నదని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన మోదీ, ఎన్ని ఇచ్చారని నిలదీశారు.‘ఎనిమిదేండ్లుగా చేసిందేమీ లేదు. నీ పనైయిపోయింది. ఇక వద్దు. టాటా బైబై చెప్పాల్సిన టైం వచ్చింది’అని కేటీఆర్ పేర్కొన్నారు. 2014కు ముందు మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే మోదీ, ఆ ప్రభుత్వాన్ని తిట్టిపోశారని, ‘మన్మోహన్ నీకు చేతగాకపోతే దిగిపో’ అని హూంకరించారని కేటీఆర్ గుర్తుచేశారు. అదే ఇప్పుడు మోదీ హయాంలో అదే సిలిండర్ ధర రూ.1,050 అయిందని ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని నడిపే శక్తి మన్మోహన్కు లేదని, అసమర్థ ప్రభుత్వమని నిందలేసి.. ఇప్పుడు మోదీ చేస్తున్నదని ఏమిటని నిలదీశారు. రూపాయి విలువ పడిపోతే భారత ప్రతిష్ఠ దిగజారిపోయిందన్న మోదీ, ఇప్పుడు అదే విలువ రూ.79కి దిగజారితే ఏమనాలని ప్రశ్నించారు. స్విస్ బ్యాంకులో నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్నారని, ఎంత తెచ్చారు? ఎంతమంది ఖాతాల్లో డబ్బులు వేశారని నిలదీశారు. పెద్దనోట్ల రద్దుతో దేశ ప్రజలకు ఒరిగింది ఏమీలేదని చెప్పారు. 50 రోజుల సమయం ఇవ్వండి, పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థమారకపోతే ప్రజలు ఏ శిక్ష విధించినా సిద్ధమేనని చెప్పిన మోదీ ఇప్పుడేం చెప్తారని ప్రశ్నించారు. ‘తగ్గిందా నల్లధనం? తగ్గిందా నక్సలిజం? తగ్గిందా ఉగ్రవాదం?’ అని నిలదీశారు. అందుకే ‘బైబై మోదీ.. టైమొచ్చింది’ అని టాటా చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిజమైన నియంత మోదీ
‘సాలు దొర..సెలవు దొర’అని కేసీఆర్పై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నిజమైన దొర.. నిజమైన నియంత మోదీ మాత్రమేనని నిప్పులు చెరిగారు. ఎనిమిదేండ్లలో నియంతృత్వ, నిరంకుశ పోకడలతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోసింది మోదీయేనని మండిపడ్డారు. ‘8 రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసినోడు నియంతనా? లేక మీరు తిట్టిన తిట్లన్నీ మౌనంగా భరిస్తున్న కేసీఆర్ నియంతనా’ అని ప్రశ్నించారు. నిజంగానే కేసీఆర్ దొర అయితే.. మౌనంగా ఉండేవారు కాదని, అందరినీ జైల్లో వేయకపోవునా అని ప్రశ్నించారు. తమకు సహనం ఉన్నదని, తాము తలచుకుంటే అంతకు వందరెట్లు ఎక్కువ అనగలమని ఘాటుగా హెచ్చరించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ కాదు కదా, కనీసం తుక్కు కూడా ఇవ్వలేదని ఎద్దేవాచేశారు. కాజీపేట కోచ్ఫ్యాక్టరీ, పారిశ్రామిక రాయితీలు.. ఇలా ఏమీ ఇవ్వలేదని.. అందుకే బరాబర్గా మోదీకి బైబై.. టాటా చెప్పాలని పిలుపునిచ్చారు. మాట్లాడితే హిందూ-ముస్లిం, ఇండియా-పాకిస్తాన్ అంశాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య మతకలహాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు పోతుగంటి రాములు, రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, పైలట్ రోహిత్రెడ్డి, సుధీర్రెడ్డి, జైపాల్ యాదవ్, మెతుకు ఆనంద్, మాజీమంత్రి చిత్తరంజన్దాస్, కార్పొరేషన్ చైర్మన్లు వాల్యా నాయక్, వెంకటేశ్వర్రెడ్డి, బండ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సొమ్మెవరిది.. కులుకుతున్నదెవరు?
మోదీ దేశానికి ఏమీ ఇవ్వలేదు సరికదా.. దేశ ప్రతిష్ఠను మరింత దిగజార్చారని కేటీఆర్ మండిపడ్డారు. 30 ఏండ్లలో ఎన్నడూలేని ద్రవ్యోల్బణాన్ని చవిచూశామని, 45 ఏండ్లలో ఎన్నడూలేని విధంగా నిరుద్యోగిత రేటు, ప్రపంచంలోనే అత్యధిక వంటగ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని చెప్తూ.. ఇంత అసమర్థ ప్రధాని అవసరమా? అని ప్రశ్నించారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కేంద్రానికి రూ.రూ.3,65,797 కోట్లు చెల్లిస్తే, కేంద్రం నుంచి తిరిగి తెలంగాణకు వచ్చింది రూ.1.68 లక్షల కోట్లేనని వివరించారు. జాతి నిర్మాణంలో తెలంగాణ చెమట, రక్తం ఉన్నదని చెప్పారు. ఎవరి సొమ్ముతో, ఎవరు కులుకుతున్నారని నిలదీశారు. ప్రధాని మోదీ..తెలంగాణ ప్రజలకు సెల్యూట్ కొట్టి, దండం పెట్టాలని డిమాండ్ చేశారు.
ఆ సిపాయిలకు అభివృద్ధిని చూపండి
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా 119 నియోజకవర్గాలకు ఆ పార్టీ ఇన్చార్జీలను నియమించిందని, మూడు రోజులపాటు ఆ సిపాయిలు నియోజకవర్గాల్లో తిరిగేందుకు వస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. అన్ని నియోజకర్గాల్లో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను చూపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంట్ లేక పారిశ్రామికవేత్తలు, రైతులు రోడ్ల మీద పడ్డారని, అదే తమ నాయకుడు కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారని.. ఈ విషయాన్ని కండ్లకు కట్టేలా చూపించాలని కోరారు. రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని, రైతు వేదికలు, మిషన్ భగీరథ నల్లా, హరితహారంతో పెరిగిన గ్రీనరీని చూపించాలని సూచించారు. బతుకులే కాదు.. చావును సంస్కారవంతంగా ఎలా నిర్వహిస్తున్నారో వైకుంఠధామాలను ఆ నాయకుల చేయి పట్టుకొని వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డంపింగ్యార్డ్కు తీసుకెళ్లాలని, కల్యాణలక్ష్మి/షాదీముబారక్, కేసీఆర్ కిట్లు, హైదరాబాద్లోని ఫ్లై-ఓవర్లను, అండర్పాస్లను చూపించి, దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇవన్నీ అమలుచేయాలని డిమాండ్ చేయాలన్నారు.