మన దేశంలో బ్రహ్మాండంగా భూమి ఉన్నది, నదుల్లో కావాల్సినన్ని నీళ్లున్నాయి. మంచి సూర్యరశ్మి వస్తున్నది. అద్భుతమైన మానవ వనరులున్నాయి. అయినా రైతులు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? వారికి ఎందుకు మద్దతు ధర దక్కడం లేదు? పండించిన పంటను అమ్మడానికి ఎందుకు కష్టపడాల్సి వస్తున్నది? ఈ సమస్యలకు 75 ఏండ్లుగా సమాధానం దొరకడం లేదు. ఇవన్నీ మనం చూస్తూ ఉండిపోదామా? కొట్లాడుదామా?
కచ్చితంగా విజయం సాధిస్తాం. దేశంలో మార్పు వస్తుంది. దేశ సంపదను ప్రజలకు పంచుతాం. రైతులకు హక్కులన్నీ వస్తాయి. అన్ని వర్గాల సహకారంతో సుసంపన్న భారతదేశాన్ని నిర్మిస్తాం.
మన దగ్గర వనరులున్నా చిత్తశుద్ధి కలిగిన పాలకులు లేరు. ప్రస్తుతం దేశంలో ‘సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్.. ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్’ పద్ధతి నడుస్తున్నది. నష్టాలు వస్తే ఆ భారాన్ని ధరల పెంపు రూపంలో ప్రజలపై వేసి, వారి జేబులకు చిల్లు పెడుతున్నారు. లాభాలొచ్చే సంస్థలను మాత్రం తమ కార్పొరేట్ మిత్రులకు అమ్మేస్తున్నారు. ఇలాంటి విష వలయం నుంచి దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉన్నది.
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ‘తాగునీళ్లివ్వరు, కరెంటివ్వరు. సాగునీరివ్వరు. మరేమిస్తారంటే ఉపన్యాసాలు ఇస్తారు. ఇంకా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి ఆందోళన చేయాల్సిన పరిస్థితులా? 13 నెలలపాటు పోరాడినా ఫలితం ఏమైనా ఉన్నదా? ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు. కేంద్రం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. దేశప్రజలు, పేదలు, రైతులంటే ఇంత హేళనా? ఇంత నిర్లక్ష్యమా? ఇది పూర్తిగా మారిపోవాలి. రైతులు నాగలి పట్టడమే కాదు.. కదం కూడా తొక్కాలి. ఇకపై రైతులే ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. నదీజలాలు సముద్రంలోకి కాదు పంటపొలాలకు, ఇంటింటికీ రావాలె. అందుకోసమే ఈ పోరాటం. ప్రతి ఒక్కరూ కలిసి రావాలె’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్తోపాటు, పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు శుక్రవారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఏండ్లుగా దేశాన్ని ఏలుతున్న పార్టీలు చేసిన అభివృద్ధి ఏమీలేదని మండిపడ్డారు. దేశంలో పొడచూపుతున్న విభజన రాజకీయాలపై ధ్వజమెత్తారు. దేశం 75 ఏండ్ల స్వాతంత్య్ర మహోత్సవాలను నిర్వహించుకుంటున్నదని, ఇప్పటికే రెండు తరాలు గడిచిపోగా, మూడో తరం కొనసాగుతున్నదని సీఎం కేసీఆర్ వివరించారు.
మనతోపాటు, మన తరువాత స్వాతంత్య్రం పొందిన దేశాలు నేడు ఎక్కడున్నాయి? మన దేశం ఎక్కడున్నదని ప్రశ్నించారు. అమెరికా, చైనాతోపాటు ప్రపంచంలో ఏ దేశానికీ లేనివిధంగా అపూర్వమైన సహజసంపద, సాగుభూమి భారత్కు ఉన్నదని కేసీఆర్ పునరుద్ఘాటించారు. మన దేశం నుంచి యువత అమెరికాకు ఎందుకు క్యూ కడుతున్నదని ప్రశ్నించారు? ‘పిల్లలు అక్కడ అమెరికా గ్రీన్కార్డు పొందితే ఇక్కడ తల్లిదండ్రులు దావత్ చేసుకుంటున్నారు. ఇది దేనికి సంకేతం. మనం ఎక్కడ ఉన్నాం’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అదొక్కటి చాలు దేశంలో ఏమి జరుగుతున్నదో, దేశ ప్రజలు ఎంత వంచనకు గురవుతున్నారో అర్థం చేసుకోవడానికి అని పేర్కొన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతం కనీసం తాగునీళ్లు, సాగునీళ్లు, కరెంటు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నదని ధ్వజమెత్తారు. ఎందరో ముఖ్యమంత్రులు, ప్రధానులు, ఎన్నో ప్రభుత్వాలు మారిపోయినా రైతుల కష్టాలను తీర్చలేదని విమర్శించారు. అందుకు కారణాలు ఏమిటనేది ఆలోచించాలని పిలుపునిచ్చారు.
దేశం లక్ష్యాన్ని కోల్పోవడం వల్లే..
‘ప్రజలను వంచించాలే.. భ్రమలు కల్పించాలే.. ఎన్నికల్లో గెలవాలే..’ ఇదీ భారత రాజకీయాల తీరు అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఆ పరిస్థితి మారాలని, ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదని, ప్రజలని, అప్పుడే అసలైన ప్రజాస్వామ్యమని వివరించారు. నేడు అనేక పార్టీలు జిమ్మిక్కులు, అసంబద్ధ వాగ్ధానాలు, ఉపన్యాసాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. మన దేశానికి ఒక లక్ష్యమంటూ ఉన్నదా? అనే ప్రశ్న ఎప్పటి నుంచో తన మనసులో మెదులుతున్నదని, ఖమ్మం సభలో అదే అడిగానని గుర్తు చేశారు. దేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్నికల్లో ఏదైనా చేసి గెలవడం, కులం, జాతి, ధర్మం పేరిట ప్రజలను, సమాజాన్ని విభజిస్తూ ఎన్నికల్లో గెలవడమే పార్టీల పరమావధిగా మారిందని మండిపడ్డారు. దేశాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకు సేవల చేయాలన్న సోయి ఎవరికీ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహానది నుంచి ఒడిశా 30% కంటే ఎక్కువ జలాలను వినియోగించుకోవడం లేదని, గత 50 ఏండ్లుగా మిగిలిన నీళ్లు ఏటా సముద్రంలో కలుస్తున్నాయని, బ్రాహ్మణి, వైతరణి ఇంకా అనేక నదుల పరిస్థితి కూడా ఇదేనని వివరించారు. ఆ నదీ జలాలు ఎందుకు పంటపొలాలకు పారడం లేదని, ప్రజల దాహం తీర్చడం లేదని, తాగునీటికి ఒడిశా కష్టాలు పడాల్సిందేనా? అని నిలదీశారు. 75 ఏండ్లుగా ఎన్నో హామీలు, ఉపన్యాసాలు ఇస్తున్న పెద్దపెద్ద నేతలు కనీసం తాగునీటిని కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
నాగలి పట్టడమే కాదు కదం తొక్కాలి
తాగునీళ్లు ఇవ్వరు. కరెంటు ఇవ్వరు. సాగునీరు ఇవ్వరు.. కానీ, దశాబ్దాలుగా ఉపన్యాసాలు ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వాల పనితీరుపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి ఆందోళన చేయాల్సిన పరిస్థితులా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు 13 నెలలపాటు పోరాడినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. రైతులు అడిగిన ఒక్కదానికీ జవాబు లేదని, ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని మండిపడ్డారు. ఇప్పటివరకు కేంద్రం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, దేశప్రజలను, పేదలను అంత చులకనగా చూస్తారా? రైతులంటే అంత హేళనా? అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి పాలన పూర్తిగా మారిపోవాలని, అందుకోసమే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని నినదిస్తున్నామని స్పష్టంచేశారు. రైతులు నాగలి పట్టడమేకాకుండా, కదం తొక్కాలని, రాబోయే ఎన్నికల్లో ఇదే తమ నినాదమని చెప్పారు. ఇప్పటివరకు రైతులు ఎంతోమందిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానులను చేశారని, కానీ ఇకపై రైతులే ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలని ఆకాంక్షించారు. నదీజలాలు సముద్రానికి కాకుండా పంటపొలాలకు, ఇంటింటికీ రావాలని ఉద్ఘాటించారు.
డబ్బులు కాదు.. చేయాలనే తపన ఉండాలె..
దేశంలో అన్ని రాష్ర్టాల మాదిరిగానే ఎనిమిదేండ్ల క్రితం తెలంగాణ కూడా అనేక విధాలుగా అరిగోస పడ్డదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. విద్యుత్తు, తాగు, సాగునీటి కోసం తండ్లాడిందని, రాష్ట్ర ఏర్పాటు తరువాత వాటన్నింటికీ పరిష్కారం చూపెట్టామని వివరించారు. ఆదివాసీ, బంజారా, పేదలు, ధనవంతులు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీటిని నల్లాల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో సాధ్యమైంది, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ర్టాల్లో ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే అత్యధికంగా చోటుచేసుకుంటున్నాయని చెప్పుకోవడమంటే సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు. తెలంగాణలో అమలుచేస్తున్న వినూత్న పథకాల ఫలితంగా రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గిపోయాయని వివరించారు. మహబూబ్నగర్ నుంచి వలసలు పోయినోళ్లు నేడు వాపస్ వచ్చారని, తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇది మహారాష్ట్ర, ఒడిశాలో ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. ఇది డబ్బులతో ముడిపడినది కాదని, చేయాలనే తపనతో ముడిపడినదని స్పష్టంచేశారు.
అంతిమ విజయం మనదే..
ఎన్నికల్లో ప్రజలు గెలిచే సంప్రదాయాన్ని పాదుకొల్పాలనే మహత్తర ఆశయంతో, దేశాన్ని గుణాత్మక అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ను ఏర్పాటుచేశామని సీఎం కేసీఆర్ నొక్కిచెప్పారు. అందులో కచ్చితంగా విజయం సాధిస్తామని సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేశారు. వాళ్ల దగ్గర పైసలు, బలగం, కుట్రలున్నాయని, కానీ ధర్మం తమ వైపు ఉన్నదని, న్యాయం అడుగుతున్నామని, మానవ శ్రేయస్సు కోసం, హక్కుల కోసం పోరాడుతున్నామని అంతిమ విజయం తమదేనని ఉద్ఘాటించారు. హక్కులను అడిగినప్పుడు ఇవ్వకుంటే లాక్కోవాలె పోరాడి సాధించుకోవాలని అలా కానప్పుడు వారినే లాగిపడేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో మున్ముందు చాలా కష్టపడాల్సి ఉంటుందని, దేశంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.
ఒడిశాలో ప్లాంట్లు ఉన్నా.. కరెంటు కోతలు ఎందుకు?
ఒడిశాలో పెద్ద పెద్ద, నాణ్యమైన విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నా కరెంటు కోతలు ఎందుకు ఉంటున్నాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజల గురించి ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో 4 లక్షల మెగావాట్లకుపైగా స్థాపిత విద్యుత్తు సామర్థ్యం ఉన్నప్పటికీ 2.10 లక్షల మెగావాట్లకు మించి వాడుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పారు. ఉత్పత్తి అయిన కరెంటును సరఫరా చేసేందుకు అమెరికా దగ్గరో, ఇంకొకరి దగ్గరో చేయి చాపాల్సిన పనిలేదని పేర్కొన్నారు. సొంత వనరులను వాడి, విద్యుత్తును ఉత్పత్తి చేసి అందించడంలో ఎందుకు వెనుకబడిపోవాలని ప్రశ్నించారు. మన దగ్గర వనరులున్నా చిత్తశుద్ధి కలిగిన పాలకులు లేరని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దేశంలో ‘సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్.. ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్’ పద్ధతి నడుస్తున్నదని విమర్శించారు. నష్టాలు వస్తే ఆ భారాన్ని ధరల పెంపు రూపంలో ప్రజలపై వేసి, వారి జేబులకు చిల్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లాభాలొచ్చే సంస్థలను మాత్రం తమ కార్పొరేట్ మిత్రులకు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి విష వలయం నుంచి దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. అందుకే ఆలస్యం చేయకుండా బీఆర్ఎస్ను స్థాపించానని స్పష్టంచేశారు. దేశంలోని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే తన స్వప్నమని చెప్పారు. బీఆర్ఎస్కు అద్భుతమైన స్పందన వస్తున్నదని, దేశం నలుమూల నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు.
75 ఏండ్లుగా రైతుల సమస్యలు తీరలేదు
ప్రపంచంలోనే అత్యధికంగా వ్యవసాయ యోగ్యమైన భూమి మన దేశంలో ఉన్నదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అమెరికా విస్తీర్ణంలో మనకన్నా రెట్టింపు ఉన్నా, అక్కడ 29% భూమి మాత్రమే వ్యవసాయానికి అనుకూలమని చెప్పారు. చైనా మన కన్నా ఒకటిన్నర రెట్ల విస్తీర్ణంలో ఎక్కువ ఉన్నా 16% భూమి మాత్రమే వ్యవసాయానికి పనికొస్తుందని వివరించారు. మన దేశంలో 83 కోట్ల ఎకరాలకుగానూ 50% భూమిలో వ్యవసాయం చేయొచ్చని చెప్పారు. ‘మన దేశంలో బ్రహ్మాండంగా భూమి ఉన్నది, నదుల్లో కావాల్సినన్ని నీళ్లున్నాయి, మంచి సూర్యరశ్మి వస్తున్నది, అద్భుతమైన మానవ వనరులున్నాయి, అయినా రైతులు ఎందుకు రోదిస్తున్నారు? ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? వారికి ఎందుకు మద్దతు ధర దక్కడం లేదు? పండించిన పంటను అమ్మడానికి ఎందుకు కష్టపడాల్సి వస్తున్నది?’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సమస్యలకు 75 ఏండ్లుగా సమాధానం దొరుకడం లేదన్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉండిపోదామా? కొట్లాడుదామా? అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా పీడిస్తున్న సమస్యలపై పోరాడాలంటే వజ్ర సంకల్పం కావాలని, అప్పుడే ఈ యుద్ధంలో గెలుస్తామని, బీఆర్ఎస్ కలలుగన్న అద్భుతమైన భారతదేశం సాక్షాత్కారం అవుతుందని సీఎం స్పష్టంచేశారు.
ప్రజలే గెలవాలి
పేదల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో కృషి చేసే పార్టీ గెలిచినప్పుడే ప్రజలు గెలిచినట్టు అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఒడిశాలోని గిరిజన, దళిత కుటుంబాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నదో గుర్తుచేసుకోవాలని, ఇప్పటికీ రోజూ జీవన పోరాటం చేస్తున్నారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే అంబేద్కర్ సిద్ధాంతాలను అమలు చేయడం ప్రారంభించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. తెలంగాణలో దళితుల అభివృద్ధికి ‘దళితబంధు’ ప్రారంభించామని చెప్పారు.
రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి షరతుల్లేకుండా, బ్యాంకు లింకు లేకుండా రూ.10 లక్షలు ఇస్తున్నామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రెండేండ్లలో 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని తెలిపారు. రైతుబంధును దేశమంతా విస్తరించి ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ప్రతి ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు అందిస్తామని పునరుద్ఘాటించారు. నీళ్లను సముద్రంలో కలువకుండా భూమిపైకి తీసుకొచ్చి పొలాలకు మళ్లిస్తామని, ఇంటింటికీ శుద్ధజలం అందిస్తామని చెప్పారు.
వెయ్యేనుగుల బలం వచ్చింది
ఒడిశాలో మూడు, నాలుగుసార్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసినవారు, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నవారు బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉన్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గిరిధర్ గమాంగ్ గురించి ఒడిశాలో ప్రతి ఒక్కరికీ తెలుసని, ఆయన మచ్చలేని మనిషి అని అభినందించారు. ‘నేను గిరిధర్ గమాంగ్పై పోటీ చేశా. అయినా నేను ఇప్పటికీ ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయన ఇంట్లోనే బస చేస్తాను. ఆయన ప్రేమ అలాంటిది. ఆయన నిర్మల హృదయుడు’ అని జయరాం పంగీ ఓ సందర్భంలో తనతో చెప్పారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. బీఆర్ఎస్కు మద్దతు పలికేందుకు ఇంత పెద్దఎత్తున నేతలు తరలిరావడం చూసి తనకు వెయ్యేనుగుల బలం వచ్చిందని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఎంత కష్టమైనా హైదరాబాద్కు వచ్చారని వారికి ధన్యవాదాలు తెలిపారు.
కచ్చితంగా విజయం సాధిస్తామని, దేశంలో మార్పు వస్తుందని, దేశ సంపదను ప్రజలకు పంచుతామని, రైతులకు హక్కులన్నీ వస్తాయని, అన్ని వర్గాల సహకారంతో సుసంపన్న భారతదేశాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాలాచారి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అడిగి మరీ సీఎం కేసీఆర్తో మాట్లాడించిన నేతలు
ఒడిశా రాజకీయ, సామాజిక, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించినంత సేపు తెలంగాణ భవన్ అంతా ఉద్విగ్నంగా మారిపోయింది. సందర్భాన్ని, అంశాన్ని బట్టి ఒడిస్సీలు సీఎం కేసీఆర్ ప్రసంగంలోని అంశాల పట్ల తమ సంపూర్ణ సమ్మతిని తెలియజేశారు. దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులు, వాటికి కారణాలను సీఎం కేసీఆర్ తనదైన శైలిలో అలవోకగా ఆధారాలు, లెక్కలతో సహ ఒడిస్సీయుల ముందు ఆవిష్కరించారు. అలాగే ఒడిశాలో నెలకొన్న పరిస్థితులను ఒడిస్సీల స్వానుభవాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. ఒడిశాపై సీఎం కేసీఆర్కు ఉన్న అవగాహన, భవిష్యత్ ఆలోచనా విధానాన్ని వారి ముందు ఉంచారు. ‘ చాలా దూరం నుంచి వచ్చారు. మనం రేపో, ఎల్లుండో కలిసి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, విశ్రాంతి తీసుకోండి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నపుడు ‘బోలియే..ఔర్ బోలియే’ అంటూ సభికులు నినదించారు.
మహారాష్ట్రలో పైసల్లేకనా రైతులకు కష్టాలు
దేశ రైతాంగ దుస్థితిని, ప్రత్యేకించి మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితులను సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. 75 ఏండ్ల స్వాతంత్య్రం తరువాత రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనా? అని ప్రశ్నించారు. ఈ రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే అత్యధికంగా చోటుచేసుకుంటున్నాయని చెప్పాలంటే, సిగ్గుతో తలదించుకోవటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేశామన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించినప్పుడు మహారాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ‘మహారాష్ట్రలో పైసల్లేకనా..మహారాష్ట్ర కంటే తెలంగాణలో ఎక్కువ పైసలున్నాయా? అని ఆయన నిప్పులు చెరిగారు. డబ్బుల్లేక కాదని, సమస్యను పరిష్కరించాలనే మనసు లేకపోవడం వల్లే (‘యే…ధన్కీ బాత్ నహీ..మన్కీ బాత్ హై’)నని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఒడిశాలో పింఛన్ రూ. 500లే
ఒడిశాలో పింఛన్లు కేవలం రూ.500లే కానీ తెలంగాణలో మాత్రం రూ.2016 అనే విషయాన్ని చెప్పండీ అని సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగిస్తున్నానని చెప్పే క్రమంలో ఒడిశా మాజీ ఎంపీ జయరాం పంగీ కోరారు. దీంతో తెలంగాణలో ఆసరా పింఛన్లే కాదు. ఎస్సీ, ఎస్టీ సహ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టిన కార్యక్రమాలను కేసీఆర్ వివరించారు. దళితుల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రారంభించిన దళితబంధు పథకాన్ని పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితబంధు అమలు తీరు తెన్నులు, ఆ పథకం ఇస్తున్న ఫలితాలపై ప్రత్యక్షంగా చూస్తారని చెప్పారు. అంతేకాదు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా దళితబంధు అమలు చేస్తామని, తెలంగాణలో అమలవుతున్న రైతుబంధును దేశంలోని రైతులందరికీ ‘కిసాన్ బంధు’ పేరిట అమలు చేస్తామని, రైతాంగానికి రెండేండ్లలోనే 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తామని తెలిపారు.
హిందీలో అనర్గళంగా మాట్లాడిన సీఎం
ఒడిశా నేతలు బీఆర్ఎస్లో చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం మునుపెన్నడూ లేనివిధంగా హిందీలోనే సాగింది. అరగంటపాటు సీఎం కేసీఆర్ అనర్గళమైన హిందీలో మాట్లాడారు. సోషలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ (నష్టాలుంటే ప్రజలపై రుద్దాలె..లాభాల కంపెనీలను అమ్ముకోవాలె), గిరిధర్ గమాంగ్ను స్పాట్లెస్ క్యారెక్టర్ (మచ్చలేని నాయకుడు) వంటి రెండు మూడు ఇంగ్లిష్ పదాలు మినహా సీఎం కేసీఆర్ ప్రసంగం మొత్తం హిందీలోనే సాగింది. ఇన్ని రెట్లు(గున్వత్తర్), చైనాను ఉద్దేశించి (చీన్) వంటి పదాలను ఉత్తరభారత నేతలు చెప్తుంటారు, తమది ఖాస్ హిందీ అని చెప్పుకుంటారు. అయితే, తెలుగు, తెలంగాణ యాసభాషలు, సాహిత్యంపై అద్భుత పట్టు ఉన్న కేసీఆర్కు ఉర్దూ భాషా, షాహిరీలపై అంతే పట్టుంది. ఇంగ్లిష్లోనూ ధారాళంగా మాట్లాడగలరు అని అనేక మీడియా సమావేశాలు నిరూపించాయి. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ తన ప్రసంగాలు తెలుగులో చేసినా మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడేవారు. అందుకు భిన్నంగా శుక్రవారం తన ప్రసంగం అంతా హిందీలోనే సాగడం విశేషం.