హైదరాబాద్, జనవరి 14 : ఎరువుల ధరల పెంపుపై నిరసనలు ఉధృతమవుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ద్వంద్వ నీతిపై రైతులతోపాటు నెటిజన్లు తూర్పారబడుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎరువుల ధరల పెరుగుదలపై మోదీ చేసిన రాద్ధాంతం వీడియోను తాజాగా నెటిజన్లు సోషల్మీడియాలో పోస్టు చేసి చెడుగుడు ఆడుతున్నారు. యూపీఏ హయాంలో 2010లో ఎరువుల ధరలు పెంచితే నాటి గుజరాత్ సీఎం హోదాలో నరేంద్రమోదీ తీవ్రంగా వ్యతిరేకించారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నాటి మోదీ ప్రసంగం వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ప్రస్తుతం ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి బుద్ధి చెప్పాలి? అని ప్రశ్నిస్తున్నారు. ‘2010లో ఎరువుల ధర పెరగడానికి కాంగ్రెస్ కారణమైతే, 2022లో ఎవరు కారణం? అప్పుడు కాంగ్రెస్ని ఓడగొట్టమన్నరు. మరి ఇప్పుడు బీజేపీని ఏం చేద్దాం?’ అని టీఎస్టీడీసీ చైర్మన్ మన్నె క్రిషాంక్ శుక్రవారం చేసిన ట్వీట్ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.
పెంచడమే తప్ప తగ్గింపు ధ్యాసే లేదు
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఎరువుల ధరలను పెంచడమే తప్ప తగ్గించలేదు. 2014లో అధికారంలోకి రాగానే యూరియా 50 కేజీల బస్తా ధర రూ.840 నుం చి రూ.842కు పెంచా రు. కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర రూ.890 ఉండగా రూ.1,210కి పెంచారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక యూరియా ధర 2018లో రూ.940కి, 2019లో రూ.950కి, 2021లో రూ.1,070కి ప్రస్తుతం 1,700 వరకు పెంచింది. 2018లో కాంప్లెక్స్ బస్తా ధర రూ.900 నుంచి 1,225కు, 2019లో రూ.1,040 నుంచి 1,425కు పెంచింది. తాజాగా రూ.1.395కు పెంచింది.
సబ్సిడీలు ఎత్తివేత
కేంద్రం స్వామినాథన్ కమిషన్ సిఫారసులను పాటిస్తున్నట్టు చెప్పుకోవడం తప్ప నిజాయితీగా అమలుచేయలేదు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే పూర్తిగా కొనుగోలుచేయాలి. కానీ వానకాలంలో పండిస్తే కొంటాం, యాసంగిలో పండిస్తే కొనం అంటూ కొర్రీలు పెడుతున్నది. మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తక్కువకు మార్కెట్లో అమ్ముకోవాల్సి వస్తున్నది. పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున అందిస్తూ రైతులు అప్పులపాలు కాకుండా కాపాడుతున్నది. కేంద్రం సోయి కూడా లేకపోగా సబ్సిడీలను ఎత్తివేసి, ఎరువుల ధరలను అమాంతం పెంచుతూ రైతులను గోస పెడుతున్నది.