Single use plastic | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ సాక్షిగా మరోసారి పచ్చి అబద్ధాలాడింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ (ఒకసారి వాడి పడేసే)పై రాష్ట్రంలో నిషేధం లేదని పేర్కొన్నది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై దేశవ్యాప్తంగా అమలవుతున్న నిషేధం గురించి వివరించాలని లోక్సభలో ముగ్గురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర పర్యావరణ శాఖ.. తెలంగాణలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై నిషేధం అమల్లో లేదని చెప్పింది. వాస్తవానికి తెలంగాణలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై 2016లోనే నిషేధం అమల్లోకి వచ్చింది.
50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ప్లాస్టిక్ కవర్ల తయారీ, నిల్వ, అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే నిషేధం విధించింది. ఈ మేరకు 2016 డిసెంబర్ 31న రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ 79 జీవోను విడుదల చేసింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని అతిక్రమించిన వారికి శిక్షలను కూడా నిర్దేశించింది. తయారీదారులకు రూ.50వేల జరిమానా విధించడంతోపాటు వారి లైసెన్సును రద్దుచేసే అవకాశం కల్పించింది. దుకాణదారులకు రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు.. వినియోగదారులకు రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో భాగంగా ఈ ఉత్తర్వులను విడుదల చేసిన ప్రభుత్వం.. తమ ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది.
కచ్చితంగా వివక్షే
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అడ్డుకునేందుకు తెలంగాణలో ఎన్ని చర్యలు చేపట్టినా మోదీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 35 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై నిషేధం అమలు గురించి లోక్సభలో వివరించిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ, అరుణాచల్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్కు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని చెప్పింది. మిగతా రాష్ర్టాల్లో కొన్ని చోట్ల పూర్తిగా, మరికొన్ని చోట్లపాక్షికంగా నిషేధం అమలవుతున్నట్టు పేర్కొన్నది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై అక్కసుతోనే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నదని నిపుణులు మండిపడుతున్నారు.