సూర్యాపేట : కేంద్రంలోని మోదీ సర్కార్ పెట్టుబడిదారుల కొమ్ము కాసేందుకే పరిమితం అయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. పెరిగిన వంట గ్యాస్,డీజిల్ ధరలు ఆ వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకే నంటూ ఆయన మండిపడ్డారు. వంట గ్యాస్, డీజిల్ ధరలు పెంచించేందుకు నిరసనగా ఉద్యమించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సూర్యాపేట పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున స్పందించారు.
పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు మట్టి కొట్టుకు పోయాయన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల జేబులను ముఖ్యమంత్రి కేసీఆర్ నింపుతుంటే అవే జేబులకు మోదీ ప్రభుత్వం చిల్లులు పెడుతుందంటూ ఎద్దేవాచేశారు.
పెరిగిన ధరలకు నిరసనగా నియోజకవర్గ కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలి అంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు నిచ్చిన కొద్ది సమయంలోనే మహిళలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం వారిలో వెళ్లి విరిసిన చైతన్యానికి నిదర్శనమన్నారు.