నిజామాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నందుకే తెలంగాణపై మోదీ సర్కారు కక్షగట్టి వేధిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఉపాధి హామీలో నిర్మించిన కల్లాలపై వెచ్చించిన నిధులను వెనక్కి ఇవ్వాలంటూ లేఖ రాయడం హేయమన్నారు. గురువారం నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తాతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కర్షకుల కోసం ఎనిమిదేండ్ల్లలో రూ.3 లక్షల కోట్ల్ల మేర సీఎం ఖర్చు చేశారని వివరించారు. రాష్ట్రంపై, రైతన్నలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కల్లాల కోసం 151 కోట్లు ఖర్చు చేస్తే, దాన్ని తిరిగి ఇవ్వాలనడం సిగ్గుచేటన్నారు.
నిధులు చెల్లించాలనడం దుర్మార్గం: కవిత
కల్లాల నిర్మాణానికి వెచ్చించిన నిధులను తిరిగి చెల్లించాలనడం దుర్మార్గమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ మరోసారి రైతు వ్యతిరేక సర్కారు అని తేలిపోయిందన్నారు. దేశానికి నిద్రపోతున్న చౌకీదార్లు అవసరం లేదని, జిమ్మేదార్ నేతలు అవసరమని పేర్కొన్నారు. ఉత్తరాదిలో రైతులంతా ఏడాది పాటు ఆందోళన చేసినప్పుడు దెబ్బకు దిగొచ్చిన మోదీ.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. శుక్రవారం తలపెట్టిన రైతు మహాధర్నా ద్వారా బీఆర్ఎస్ శ్రేణులంతా సత్తా చూపించాలని కేంద్రానికి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.