బోయినపల్లి/గంగాధర, ఏప్రిల్ 24: రైతు సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ప్రపంచ మార్కెట్లో బాయిల్డ్ రైస్కు ఉన్న డిమాండ్ అంచనా వేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాల్రావుపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. రైతులు, ప్రజల కోసం కేంద్రం ఒక్క సంక్షేమ పథకం ప్రవేశ పెట్టినా బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సవాల్ విసిరారు. తెలంగాణ రైతులు నష్టపోవద్దని క్వింటాల్ ధాన్యానికి రూ. 1,960 మద్దతు ధర చెల్లిస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మాత్రం క్వింటాల్ ధాన్యాన్ని రైతులు రూ.700, రూ.800కు అమ్ముకొంటున్నారని, ఈ విషయం బండి సంజయ్కి తెలియదా? అని ప్రశ్నించారు. పాదయాత్ర పేరుతో వాకింగ్ చేస్తున్న బండి సంజయ్ పక్కనే ఉన్న కర్నాటకలోని రాయచూరు, బళ్లారి వెళ్లి చూడాలని.. అక్కడ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నదా?, వడ్లు కొంటున్నదా?, రైతుబంధు ఇస్తున్నదా? తెలుసుకోవాలని సూచించారు. వరంగల్ జిల్లాలో రైతు సదస్సు పెడుతానన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. ఏటూరు నాగారం పక్కనే కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎలాంటి పథకాలున్నాయో తెలుసుకోవాలని హితవు పలికారు.ఛత్తీస్గఢ్లో రూ.800కు క్వింటాల్ ధాన్యం అమ్ముకొంటున్నారని, వారికి మద్దతు ధర ఇప్పించగలవా? అని ప్రశ్నించారు. అంతకుముందు గోపాల్రావుపల్లిలోని కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.