హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ సీఎం కేసీఆర్ అమెరికా అధ్యక్షుడిని కలిసినా, పాకిస్థాన్ ప్రధానమంత్రిని కలిసినా మేం భయపడం’.. ఇదీ కేంద్రమంత్రి కిషన్రెడ్డి మేకపోతు గాంభీర్యం. రాష్ట్ర బీజేపీ నాయకులు బయటికి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నా, లోపల మాత్రం వణికిపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ అనే పేరు వినిపిస్తేనే ఢిల్లీ పెద్దల్లో దడ మొదలవుతున్నదని చెప్తున్నారు. దేశం తలరాతను మార్చేందుకు జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని సీఎం కేసీఆర్ ప్రకటించగానే.. కమలం పార్టీ అధిష్ఠానానికి కంటి మీద కునుకు లేకుండా పోయిందని అంటున్నారు. తమ ఉనికి కోల్పోతామన్న భయంతో తెలంగాణకు వరుస టూర్లు వేస్తున్నారని, ఈ టూర్ల కోసం ఢిల్లీ నుంచి తెలంగాణకు డైరెక్ట్ రూట్ వేసుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఆ రూట్లో పనిలేకపోయినా, పనిగట్టుకొని తెలంగాణకు టూరిస్టుల్లా వస్తున్నారని పేర్కొంటున్నారు.
తెలంగాణను సాధించి.. ఎనిమిదేండ్లలోనే రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రపథాన నిలిపిన నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తే తమ పతనం ఖాయమని బీజేపీకి భయం పట్టుకొన్నదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అందుకే రెండు మార్గాల ద్వారా సీఎం కేసీఆర్పై కుట్రకు తెరలేపారని చెప్తున్నారు. ‘మొదటిది.. ఆయనను ఇబ్బంది పెట్టేలా బీజేపీ నేతలు తెలంగాణపైకి ‘దండయాత్ర’ మొదలుపెట్టారు. వచ్చినవాళ్లు ఇక్కడి అభివృద్ధిని కండ్లారా చూసి అభినందించాల్సింది పోయి ముఖ్యమంత్రి కేసీఆర్పై వ్యక్తిగతవిమర్శలు చేసి వెళ్తున్నారు. అడ్డగోలు వ్యాఖ్యలతో ఆయనపై అవినీతి ముద్ర వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రెండోది.. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఆపేయించి, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి విఫల ప్రభుత్వంగా ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు’ అని అంటున్నారు.
తిట్టనీకే వస్తున్నరు
గత 10 నెలల్లో జరిగిన పరిణామాణాలను ఓసారి పరిశీలిస్తే.. బీజేపీ కేంద్ర మంత్రులు, ఇతర రాష్ర్టాల సీఎంలు, పక్క రాష్ర్టాల నేతలు తెలంగాణకు మిడుతల దండులా వచ్చి వాలుతున్నారని తెలంగాణ వాదులు చెప్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ ఏడాదిలో రెండు సార్లు పర్యటించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 5న రాష్ట్రంలో పర్యటించగా, మరోసారి ఈ నెల 26న రానున్నారు. జేపీ నడ్డా జనవరి 4న, మే 5న తెలంగాణకు వచ్చారు. ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న ముచ్చింతల్లో పర్యటించినప్పుడు ప్రొటోకాల్ వివాదాన్ని రేపి సీఎం కేసీఆర్ను బదనాం చేసేందుకు ప్రయత్నించారు. జేపీ నడ్డా ఎప్పుడు వచ్చినా సూటిగా కేసీఆర్నే టార్గెట్ చేస్తున్నారు. మిగిలిన వారంతా వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరి ప్రవర్తనను గమనిస్తే ‘తెలంగాణకు పోతే కచ్చితంగా కేసీఆర్ను తిట్టి రావాలె’ అని అధిష్ఠానం నిబంధన పెట్టినట్టు కనిపిస్తున్నది.
శాంతి భద్రతలకు విఘాతం
దేశంలోనే విజయవంతమైన ప్రభుత్వంగా ప్రశంసలు పొందుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయాలని బీజేపీ కంకణం కట్టుకొన్నదని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే ప్రభుత్వం బదనాం అవటంతోపాటు సీఎం కేసీఆర్ను జాతీయ రాజకీయాల గురించి ఆలోచించకుండా అడ్డుకోవచ్చన్నది వారి ప్లాన్. ఇందులో భాగంగానే బండి సంజయ్ గతేడాది నవంబర్లో వడ్ల కొనుగోలు పేరుతో నల్లగొండ జిల్లాకు వెళ్లి ఉద్రిక్తతలు సృష్టించారు. ఆ తర్వాత కరోనా నిబంధనలను అధిగమించి దొంగ దీక్ష చేపట్టారు. పోలీసులు అరెస్ట్ చేయటం, కోర్టు రిమాండ్ విధించటంతో బీజేపీ నేతలు వరుసగా ఆందోళనలు చేపట్టారు. బండి విడుదలైన తర్వాత వరుసగా సభలు పెట్టారు. విద్యావంతుల సదస్సు పేరుతో బండి సంజయ్ ఓ సభ నిర్వహించి మత విద్వేషాలు రగిలేలా వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ ఎప్పటికప్పుడు చిచ్చు పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకొంటే.. దాన్ని స్థానిక మంత్రికి ముడిపెట్టి నానా హంగామా చేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నేరుగా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారికి ఫోన్ చేశారు. పాదయాత్ర పూర్తయ్యాక బండి సంజయ్ ఖమ్మం వెళ్లి సీన్ చేసి వచ్చారు. ఇటీవల హత్యకు గురైన నాగరాజుది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. దర్యాప్తు వేగంగా కొనసాగుతున్నది. అయినా బీజేపీ నేతలు దానిని రాజకీయం చేస్తున్నారు.
‘విఫల ప్రభుత్వం’ ముద్రకు యత్నం
తెలంగాణపై ఎన్ని రకాలుగా దండయాత్ర చేస్తున్నా, ఎంత మంది నాయకులు వచ్చి అడ్డగోలుగా సీఎం కేసీఆర్ను తిడుతున్నా ప్రజలు తమను ఆదరించటం లేదని రాష్ట్ర బీజేపీ నేతలకు అవగతమైంది. నేరుగా ఎదుర్కొనలేక ఢిల్లీ పెద్దలు కొత్త ప్లాన్తో రంగంలోకి దిగారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో నిధుల రాకను అడ్డుకొంటున్నారు. బాయికాడ మీటర్లు పెట్టడం మొదలు తాము చెప్పినట్టు వింటే తప్ప రుణాలు తీసుకోనీయమంటూ కొర్రీలు పెడుతున్నారు. దీంతో అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సమస్య తలెత్తింది. అంతిమంగా టీఆర్ఎస్ పాలనను ‘విఫల ప్రభుత్వం’గా ముద్రవేయాలని చూస్తున్నారు.
తెలంగాణపై ఆక్రోశం
ఎనిమిదేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానానికి చేరడాన్ని, దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తుండటాన్ని బీజేపీ రాష్ర్టాల సీఎంలు, మాజీ సీఎంలు, ఇతర నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, దీంతో పొలిటికల్ టూరిస్టులుగా వచ్చి సీఎం కేసీఆర్పై ద్వేషాన్ని, తెలంగాణ అభివృద్ధిపై ఆక్రోశాన్ని వెళ్లగక్కి పోతున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు 5 రాష్ర్టాల నేతలు వచ్చి వెళ్లారు. ఎవరూ తెలంగాణలో మాదిరి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుకోలేకపోయారు. పోనీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమైనా ఇలాంటి పథకాలను సొంతంగా అమలు చేస్తున్నదనే ముఖం లేకుండా పోయింది. వీరంతా కేసీఆర్ కాలి గోటికి కూడా సరిరారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.