కంది, జూలై 19 : సుస్థిర సమాజ నిర్మాణంలో నానో టెక్నాలజీకి అపార అవకాశాలు ఉన్నాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. హెల్త్కేర్, కమ్యూనికేషన్, ఇంధనం, ఇతర ఎన్నో తయారీ రంగాల భవిష్యత్తును నానోటెక్నాలజీ రూపుదిద్దుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఆదివారం బెంగళూర్లోని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ (సీఈఎన్ఎస్) సహకారంతో నానో జాతా 2026 జాతీయ స్థాయి విజ్ఞాన విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. శాస్త్రీయ విజ్ఞానం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సమాజానికి చేరవేసేందుకు ఐఐటీహెచ్ కృషి చేస్తున్నదన్నారు.
సీఈఎన్ఎస్ డైరెక్టర్, నానో జాతా జాతీయ సమన్వయకర్త బీఎల్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలంటే బహుళశాఖల పరిజ్ఞానం కలిగిన పరిశోధకులు అవసరం అన్నారు. రోజాంతా సాగిన ఈ కార్యక్రమంలో నానో క్విజ్ పోటీలు, ఉపన్యాసాలు, సైన్స్ రోడ్ షోలు, విద్యార్థుల ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్లు విశేష ఆకర్శనగా నిలిచాయి. రోజువారి జీవితంలో ఉపయోగించే సాంకేతికతల వెనుక ఉన్న శాస్ర్తాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రదర్శనలు నిర్వహించారు.