హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తేతెలంగాణ): రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రభావంతో ఈనెల 27 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది. గురువారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినట్టు వెల్లడించింది.
శుక్రవారం మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. గడిచిన 24గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనథ్లో అత్యధికంగా 2.95 సెం.మీ, ములుగు జిల్లా వాజేడులో 2.55 కన్నాయిగూడెంలో 2.33, గట్టులో 1.61 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెలలో 1.60 సెం.మీ వర్షపాతం నమోదైంది.