ఖమ్మం, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా? అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాల్ విసిరారు. మంత్రి స్వగ్రామమైన గండుగులపల్లి లేదా ఖమ్మం, హైదరాబాద్ ఎక్కడైనా సరే చర్చకు రెడీగా ఉన్నట్టు ప్రకటించారు. జిల్లా పర్యటనకు వచ్చిన మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావుపై మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలను తాతా మధు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయ న మీడియాతో మాట్లాడారు. వ్యవసాయరంగాన్ని కేసీఆర్ విస్మరించారని మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. గతం లో మంత్రిగా పనిచేసిన తుమ్మల పాలే రు నియోజకవర్గంలో భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించాలనే ఆలోచన ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టు ‘భక్తరామదాసు’ ను తుమ్మల చేతుల మీదుగా పూర్తిచేసింది నిజంకాదా? అని గుర్తుచేశారు. రైతుబంధు సక్రమంగా ఇవ్వలేదని మంత్రి తుమ్మల అబద్ధాలు మాట్లాడుతున్నట్టు మండిపడ్డారు. ఆయన స్వగ్రామం గండుగులపల్లిలోని రైతులందరికీ రైతుబంధు వచ్చిందా? లేదా అనే దానిపై చర్చకు సిద్ధమా అని అడిగారు.