హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అన్నేండ్ల పాలనలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వకపోగా, ఆయన ఫొటోతో కనీసం పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయలేని నాయకులు తెలంగాణకు వచ్చి ఆయన పేరు ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని పీవీ తన య, ఎమ్మెల్సీ వాణీదేవి ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆమె తెలంగాణభవన్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఆయన జీవించి ఉన్నప్పుడు కానీ, చనిపోయిన తర్వాత కానీ గుర్తింపునకు నోచుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో ఎంతోమంది ప్రధానులకు ఘాట్లు ఉంటే పీవీకి మాత్రం ఘాట్ కాదు కదా, పార్లమెంటులో ఆయన చిత్రపటాన్ని కూడా పెట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు నేటికీ ఆయన సేవలను గుర్తించలేకపోయారని విచారం వ్యక్తంచేశారు. తెలంగాణ ఎన్నికల వేళ ఆయన పేరు చెప్పుకుని రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. సత్యసాయిబాబా వంటి వారే తన తండ్రిని ‘సేవియర్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణించారని గుర్తు చేశారు. పీవీ చివరి వరకు కాంగ్రెస్నే నమ్ముకుంటే ఆ పార్టీ మాత్రం ఆయన పేరున కనీసం పోస్టల్ స్టాంపుతో కూడా నివాళి అర్పించలేకపోయిందని విమర్శించారు.
బీఆర్ఎస్ ద్వారానే పీవీకి నివాళి
బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి పీవీ సేవలను గుర్తించిందని వాణీదేవి పేర్కొన్నా రు. హైదరాబాద్ నడిగడ్డపై భారీ వీపీ విగ్రహాన్ని నిర్మించి, ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందని గుర్తు చేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపినట్టు వివరించారు.
ఈ గడ్డపై పుట్టి, ఇక్కడినుంచి దేశాధినేతగా ఎదిగిన వ్యక్తి చరిత్ర తెలియని వ్యక్తులు, మన సంప్రదాయం, కట్టుబొట్టూ తెలియని వ్యక్తులు తెలంగాణను అభివృద్ధి చేస్తామని వస్తే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. చైతన్యం ఉన్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటు ద్వారా బుద్ధి చెప్పి, బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఎన్నికల వేళైనా సోనియా కుటుంబానికి పీవీ గుర్తుకొచ్చినందుకు ఆనందంగా ఉన్నదని మేయర్ ఎద్దేవా చేశారు.