కరీంనగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : జమ్మికుంట పట్టణం గులాబీ మయమైంది. మంగళవారం ఇక్కడ నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత నియోజకవర్గంలో మారుతున్న పరిస్థితులకు ఈ సభ అద్దం పట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభకు రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్య లో తరలివచ్చి విజయవంతం చేశారు. స్థానిక ప్రభు త్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ సభా ప్రాంగణం మొత్తం గులాబీ మయమైంది. బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు కలిసి కట్టుగా శ్రమించడంతో అంచనాలకు మించి జనాన్ని స్వచ్ఛందంగా తరలివచ్చారు. దీంతో జమ్మికుంటలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ శ్రేణుల సందడే కనిపించింది.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి పది ట్రాక్టర్లకు తక్కువ కాకుండా రైతులు స్వచ్ఛందంగా సభకు తరలి వచ్చారు. డప్పు వాయిద్యాలు, నృత్యాలతో సందడి చేసుకుంటూ ఏ ఊరికావూరు ప్లెక్లీలు ప్రదర్శిస్తూ బహిరంగ సభకు హాజరయ్యారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత ఆయన ప్రజల్లోకి రాకపోవడం, స్థానిక సమస్యలను పట్టించుకోక పోవడం, బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు సమిష్టిగా జన సమీకరణలో పాలుపంచుకున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులను ఒక్కతాటిపైకి తెచ్చి బహిరంగ సభను విజయవంతం చేసిన ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డిపై మంత్రి కేటీఆర్తోపాటు సభకు విచ్చేసిన మిగతా ఇద్దరు మంత్రులు ప్రశంసలు కురిపించారు. కేటీఆర్ మాట్లాడుతూ గెలిచిన ఈటల రాజేందర్ ప్రజాసమస్యలను పట్టించుకోకుండా, దేశాన్ని ఉద్దరిస్తానని వెళ్లాడని, కానీ ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్, అతనికి తోడుగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నిలిచి జనం సమస్యలు తీరుస్తున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, బీజేపీ చేస్తున్న మోసం కండ్లకు కట్టినట్టు అర్థమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృ ద్ధి, సంక్షేమం కోసం విశే ష కృషి చేస్తున్నది. హైదరాబాద్ ఉద్యోగ కల్పవల్లిగా మారింది. దేశవిదేశాల నుంచి కంపెనీలు రాష్ర్టానికి రావడంతో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. కేటీఆర్ స్పీచ్ నేరుగా ఎన్నడూ వినలేదు. ఈ సభ జీవితాంతం గుర్తుండిపోతుంది.
– నీల పున్నం, బీఆర్ఎస్ నేత(వీణవంక)
బీజేపీ చేస్తున్న మోసాలు బాగా అర్థమయ్యాయి. డిగ్రీ పూర్తి చేసిన నేను బతుకుదెరువుకోసం అప్పట్లో హైదరాబాద్కు పోయిన. మాకు ఇంటికాడ వ్యవసాయమున్నది. ఇప్పుడు హైదరాబాద్లో నౌకరి వదిలిపెట్టి ఊరిలో వ్యవసాయం చేస్తున్నా. సీఎం కేసీఆర్ రైతుబంధు ఇస్తుండటంతో మా కష్టాలు తీరాయి.
– నాగులపల్లి మహేశ్, మాచనపల్లి, (జమ్మికుంట రూరల్)