హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయించిన ఘనత పీఆర్టీయూ టీఎస్దేనని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ఉద్యోగులకు పూర్తి నగదు రహిత చికిత్సనందించే హెల్త్ స్కీం జీవోను ప్రభుత్వం జారీ చేయడం సంఘం సాధించిన గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మొదటి పీఆర్సీలో 30శాతం ఫిట్మెంట్ను సాధించామని చెప్పారు. రెండో పీఆర్సీ ద్వారా మంచి ఫిట్మెంట్ సాధించి ఉపాధ్యాయులకు కానుకగా అందిస్తామని తెలిపారు.
ప్రస్తుతం నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియ కొనసాగేలా సంఘం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న టీచర్ల బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. సంఘం ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టగా, సమావేశం ఆమోదించింది. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ వర్తింపజేయాలని, గురుకుల పాఠశాలల్లోని టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు అందించాలని, హెల్త్కార్డులను అందజేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి, ఇన్నారెడ్డి, చిత్తలూరి ప్రసాద్, గీత, త్రివేణి, విజయ, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.