నిజామాబాద్ ప్రజలకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుతో ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదికి సరికొత్త నడక నేర్పారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో జీవనది గోదావరి తెలంగాణ వ్యాప్తంగా బీడుభూములకు జీవంపోస్తూ ముందుకు సాగుతున్నదని వ్యాఖ్యానించారు. కొండపోచమ్మసాగర్ నీటిని నిజాంసాగర్కు తరలించేందుకు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ హల్దీవాగులో జలాలను విడుదల చేస్తున్న సందర్భంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు శుభాక్షాంక్షలు తెలుపుతూ.. ఎమ్మెల్సీ కవిత సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మేడిగడ్డ వద్ద సముద్రమట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి జలాలను లిఫ్ట్ చేసి మరో 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మసాగర్కు గోదావరి జలాలను తరలించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు నుంచి హల్దీవాగు ద్వారా మంజీరానదిలోకి కాళేశ్వరం జలాలను తీసుకురావడం అద్భుతమని అభివర్ణించారు. మంజీరానదిపై ఎగువ ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్ర ఇబ్బడి ముబ్బడిగా ఆనకట్టలు కట్టడం వల్ల కొన్ని సంవత్సరాలుగా నిజాంసాగర్ బోసిపోతున్నదని, ఇటువంటి పరిస్థితిలో కొండపోచమ్మసాగర్ నుంచి కాళేశ్వరం జలాలను తరలించటం వల్ల పాత ఆయకట్టు స్థిరీకరణకు నోచుకుంటుందని తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా రైతాంగానికి రెండు పంటలు సాగు చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంటుందని చెప్పారు.
మరిన్ని వార్తలు చదవండి..
ఒక్క గ్రామానికి ఏడాదికి 3.37 కోట్లు
తపాస్పల్లికి మల్లన్నసాగర్ నీరు
మల్లన్నసాగర్ నుంచే నిజాంసాగర్కు