MLC Kavitha | మహిళా రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తూనే.. బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న పోరాటాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు లోక్సభలో ఆమోదం పొందినందుకు దేశ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా ఉండే మహిళలు అధికారంలో కూడా సగమని డిమాండ్ చేశామన్నారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం అమలు చేయదలచుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. మహిళలు మరో ఐదు సంవత్సరాలు వేచి చూడాల్సిరావడం బాధాకరమన్నారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు అవకాశాలు కల్పించకపోవడం బాధగా ఉందని, ఆత్మ లేని శరీరంలా.. ఈ బిల్లు కూడా ఆత్మ కోల్పోయినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ వర్గం మహిళలైనా వెనుకబడేస్తే దేశం ముందుకు ఎలా వెళ్లగలుగుతుందో బీజేపీ ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. సబ్ కా వికాస్.. సబ్కా సాత్ అంటున్న బీజేపీ నినాదంలో బీసీ మహిళలను చేర్చకపోవడం శోచనీయమన్నారు. బీసీ మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే ప్రస్తుతం బిల్లు ఆమోదించినందుకు ఉత్సవం చేసుకుంటామని, దేశ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నారన్నారు.