MLC Kavitha | బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఊరుకోబోమని రేవంత్ సర్కారును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్లో పెద్ద సంఖ్యలు చేశారు. వారికి కండువా కప్పి తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండి కొట్లాడారని.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారన్నారు. అదే స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని.. సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుం బిగించాలన్నారు.
బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండగానే.. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదన్నారు. బీసీలకు 42 రిజర్వేషన్లకు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కర్నాటకలో కులగణన ఎలా చేయాలో అక్కడి సీఎం సిద్దరామయ్యకు నేర్పించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని.. సీఎం ఈ ప్రకటన చేసిన గంట సేపటికే కాంగ్రెస్ అధికారికంగా ఒక ఫొటో విడుదల చేసిందని.. ఆ ఫొటోలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారని.. రేవంత్ రెడ్డి మాత్రం లేరన్నారు. దీన్ని బట్టే రేవంత్ రెడ్డి ఎన్ని అబద్దాలు ఆడుతున్నారో అర్థమవుతుందన్నారు. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారని.. దర్శనాల సంగతి పక్కనబెట్టి ప్రజా సమస్యలపై సీఎం దృష్టిపెట్టాలని సూచించారు.
ఆర్ఎస్ఎస్ స్కూల్, టీడీపీ కాలేజీలో చదువుకున్నానని.. జాబ్ కాంగ్రెస్ లో చేస్తున్నానని సీఎం అన్నారని.. చేస్తున్న జాబ్లో కూడా రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు రావడం లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లడంలో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ చేశారని.. కనీసం మంత్రివర్గాన్ని కూర్పు చేసుకోలేని సీఎం రేవంత్ రెడ్డి అని.. ఇంత అసమర్థ, బలహీన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంత బలహీనంగా లేకుండేనని.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు, విద్యారంగ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని.. దాదాపు రూ.8వేల కోట్ల మేర ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని.. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్య భరోసా కార్డులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని విస్మరిస్తోందని.. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మెరుపులా పనిచేయాలని సూచించారు.