MLC Kavitha | ఈ నెల ఒకటిన పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉందని.. ఇప్పటి వరకు వాటి ఊసేలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అన్నసాగర్లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని కవిత పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకటి రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ఆరోపించారు. రైతుబంధు నిధుల పంపిణీ ప్రస్తావనే లేదన్నారు. ప్రజా పాలనలో భాగంగా 1.20కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారని, ఆ దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారో ప్రజలకు అర్థమవడం లేదన్నారు.
దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఇప్పటికే మీ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 44 లక్షల మందికి కేసీఆర్ హయాంలో పెన్షన్లు అందించిందని, వారికి పెన్షన్ల మొత్తం పెంచి పంపిణీ చేయకుండా.. మళ్లీ దరఖాస్తులు తీసుకుంటారన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ను వినియోగిస్తే కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, కాబట్టి ఆ ప్రకారం బిల్లు వస్తే ఎవరూ చెల్లించవద్దని పిలుపునిచ్చారు. అలాగే, అభివృద్ధిలో తాము ఎక్కడా ఆటంకపర్చబోమని, హామీల అమలులో సూచనలు చేస్తామని చెప్పారు. అవసరమైతే నిలదీస్తామని, కానీ జరుగుతున్న పనులు మాత్రం నిలిపివేయవద్దని సూచించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి, ప్రజల హక్కులను సాధించడానికి బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని, ఇందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో తెలంగాణ అనే మాట మాట్లాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడూ కూడా పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడలేదని విమర్శించారు. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని తెలిపారు. మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారని గుర్తు చేశారు. పాలమూరు ప్రజల వలసలను అడ్డుకట్ట వేయడానికి కృషి చేశామని కవిత వివరించారు.