హైదరాబాద్: ప్రధాని మోదీ రావడానికి ముందు ఈడీ రావడం సహజమేనని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ, ఈడీలకు భయపేడది లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తమపై కేసులు పెడుతున్నారని చెప్పారు. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ‘దేశంలో బీజేపీ పాలన వచ్చి ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి. ఈ 8 సంవత్సరాల్లో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చారు. వచ్చే డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. కాబట్టి.. మోదీ వచ్చేముందే రాష్ట్రానికి ఈడీ వచ్చింది. తనపై, మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు. మాపై కేసులు రాజకీయ ఎత్తుగడే.
ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగే సమాధానాలు చెబుతాం. ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం. ఈడీ, సీబీఐ, అన్నింటినీ ఎదుర్కొంటాం. మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇకనైనా మీ పంథాను మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. కేసులు పెట్టుకోండి, అరెస్టులు చేసుకోండి.. భయపడేది లేదు’ అని కవిత అన్నారు.
మీడియాకు లీకులిచ్చి తమ ఇమేజ్ను దెబ్బతీయలేరని చెప్పారు. ఈడీతో గెలవాలనుకుంటే తెలంగాణలో కుదరదన్నారు. అత్యంత చైతన్యం కలిగిన ప్రజలున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రజలు తమ వెంట ఉన్నంతకాలం తమకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.