నిజామాబాద్: కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగుల్తయని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బాండ్ పేపర్ల పేరుతో ఆ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. 137 ఏండ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీ ఇంత స్థాయికి దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. జీవన్రెడ్డి, సుదర్శన్ రెడ్డి, భట్టివిక్రమార్క వంటి పెద్ద నాయకులు కూడా బాండ్ పేపర్ రాసివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిదంటే ప్రజల్లో ఆ పార్టీ ఎంత విశ్వాసం కోల్పోయిందో అర్ధంచేసుకోవచ్చన్నారు. నిజామాబాద్లో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇదేవిధంగా డ్రామా చేసిందన్నారు. 223 సీట్లలో పోటీచేసిన ఆ పార్టీ అభ్యర్థులు హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాశారని, కానీ వాటిలో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని విమర్శించారు.
కర్ణాటకలో మహిళలకు రూ.2 వేల పెన్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలను ఇంకా ప్రారంభించలేదని చెప్పారు. యువనిధి కింది ఇస్తామన్న మొత్తాన్ని కూడా పంపిణీ చేయడం లేదని, బియ్యం పథకానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి బస్సుల సంఖ్యను భారీగా తగ్గించారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం బీజేపీ పాలనలో ఉన్న హర్యానా మొదటి స్థానంలో ఉందని, కాంగ్రెస్ అధికారంలోని రాజస్థాన్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి గత ఐదేండ్లలో 21 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాయన్నారు.
కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందని చెప్పారు. వాటిలో ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రైవేటు రంగంలో 30 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న నిరుద్యోగ మీటింగ్లు ఆ పార్టీ రాజకీయ నిరుద్యోగతకు నిదర్శనమన్నారు. వాళ్ల మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీ్ళ్లే మిగులుతాయన్నారు.
55 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ 6 గంటల కరెంటే ఇచ్చిందని, కానీ తాము వ్యవసాయం, పరిశ్రమలు, ఇండ్లకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడానికి కాంగ్రెస్ నేతలకు మనసు ఒప్పుకోలేదన్నారు. గతంలో వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉండేదని, ఇప్పుడు ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరైడ్ లేదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 65 వేల మంచాలు ఏర్పాటు చేసుకున్నామని, నేడు గవర్నమెంట్ హాస్పిటళ్లలో డెలివరీలు బాగా పెరిగాయన్నారు. 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో 6700 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలోనే 13 వేల కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించిందన్నారు. రెండు పర్యాలయాల్లో ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రేషన్ కార్డుల సమస్య పరిష్కరించి అందరికీ రూ.5 లక్షల బీమా కల్పిస్తామన్నారు. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు కొత్త పాలసీ ప్రకటిస్తామని చెప్పారు. మహిళలకు సౌభాగ్యలక్ష్మి పేరుతో రూ.3 వేలు అందజేస్తామన్నారు.