MLC Kavitha | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడా లేదని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో జరిగిన జగిత్యాల కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.
రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే సంజయ్ అన్న నినాదాల స్ఫూర్తితో పని చేయాలని కార్యకర్తలను కవిత కోరారు. గత ఎన్నికల్లో జగిత్యాల అడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరడం చాలా సంతోషం అనిపించింది అని తెలిపారు. కరోనా సమయంలో విశేషంగా సేవలందించిన ఎమ్మెల్యే సంజయ్ని ఆమె అభినందించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తప్పకుండా మరోసారి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తారని కవిత ఆకాంక్షించారు.
ఎమ్మెల్సీ రమణ సమన్వయంతో మనం అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నామని కవిత తెలిపారు. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ల గురించి ఆలోచించొద్దు అని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో కేవలం కాంగ్రెస్తోనే తమ పార్టీకి పోటీ అని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గానికి జీవన్ రెడ్డి చేసింది ఏమీ లేదని కవిత విమర్శించారు.