హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియాగాంధీ కుటుంబం బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. హామీల అమలుపై బాధ్యత తీసుకుని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలోనే తెలంగాణ గుర్తొస్తుందా? అని నిలదీశారు. సోనియాగాంధీ కుటుంబం సంతకాలు చేసిన గ్యారెంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారని, స్థానిక కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు ఓట్లు వేయలేదని చెప్పారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
బుధవారం శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగంపై ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీలేదని, ఎన్నికల సమయంలో సోనియాగాంధీ కుటుంబం వచ్చి ఇచ్చిన హామీల అమలు గురించి ప్రస్తావనేలేదని విమర్శించారు. అబద్ధాలనే మళ్లీ అందమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగడుతామని స్పష్టంచేశారు. రూ.1.5లక్షల కోట్లు అప్పులు చేసినా ఒక హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని, దీని మీద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటన చేయాల ని డిమాండ్ చేశారు.
మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, ఈ హామీని అమలు చేయకుండా నే మహాలక్ష్మీ పథకం గేమ్చేంజర్ అని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనకి నడిపిస్తూ, శుద్ధఅబద్ధాలు చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి అద్దం పడుతున్నదని తీవ్రంగా విమర్శించారు. రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయకుండానే గొప్పగా అమలు చేశామని చెప్పుకోవడం దారుణమన్నారు. ఇది ప్రభుత్వ అసమర్థతను తేటతెల్లం చేస్తున్నదని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు.