MLC Kavitha | ఉద్యోగాల కల్పనపై రేటెంతరెడ్డికి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బోధన్ యువ మహాగర్జనలో ఆమె మాట్లాడుతూ.. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మొత్తం కేవలం 24వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించారని, అందులో తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు కేవలం 10వేలు మాత్రమేనని మండిపడ్డారు. ఆ 10వేలు కూడా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టే.. చివరి రెండేళ్లు మాత్రమే ఆ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏటా సగటున వెయ్యి ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో అలా ఉంటే గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటే నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని స్పష్టం చేశారు. మరో 40వేల ఉద్యోగాల భర్తీ ఆయా దశల్లో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయగానే, పరీక్షలు పెట్టగానే, ఫలితాలు వెల్లడించగానే కాంగ్రెస్ నాయకులకు కోర్టుల్లో కేసులు వేయడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, యువతకు కలిగే ప్రయోజనాలను దొంగదారిలో అడ్డదారిలో ఆపాలని ప్రయత్నం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ మంచి చేయడం లేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ మారాలంటే యువత మారాలని, మార్పు యువత నుంచే రావాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, రకరకాల రూపంలో ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. డబ్బులు ఇవ్వచూపుతున్నాయని, కరెన్సీ నోటుపై గాంధీ తాత బొమ్మ ఉంటుందని.. జేబులో గాంధీ బొమ్మ ఉంటే ఉండనివ్వండి కానీ గుండెల్లో ధైర్యం ఉండాలన్నారు. అంత ధైర్యం ఉంటే ఎంత ఎవరు కోటీశ్వరులు వచ్చిన ఎదుర్కొంటామన్నారు. రైతు బంధు, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు. షాద ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు కావాలని ఎవరైనా కేసీఆర్ను అడిగారా? ఇవన్నీ ఎందుకు చేశారంటూ ప్రశ్నించారు.
తెలంగాణపై ప్రేమ ఉంది కాబట్టే సీఎం కేసీఆర్ ఇవన్నీ చేయగలిగారని తెలిపారు. కేసీఆర్ మనసు మహాసముద్రం, ఆలోచన ఆకాశమంతఅన్నారు. సీఎం కేసీఆర్ను ఓడగొట్టాలంటే మరో కేసీఆర్ పుట్టాలి కానీ ఓడించడం ఎవరితోనూ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. మూడోసారి కచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో వాళ్లు వాళ్లు కొట్టుకొని చావడానికే సమయం లేదని.. వాళ్లు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేరన్నారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీద కూలీలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని.. రైతుబంధును బిచ్చమేస్తున్నామంటూ నోటికి అడ్డూ అదుపు లేదంటూ మండిపడ్డారు. ఓడిపోతున్నామని అర్థమై ఏవేవో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.