MLC Kavitha | హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, నాగర్కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో రైతుల చేపట్టిన నిరసనలపై ఆమె స్పందించారు. వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర రూ.6,377 ఉండగా.. నాలుగు నుంచి ఐదు వేలకే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంశాన్ని శాసనమండలిలో ప్రత్యేకంగా ప్రస్తావించడానికి చైర్మన్ అనుమతి కోరుతూ లేఖ రాశారు. దళారీ వ్యవస్థను పారదోలి రైతుల ప్రయోజనాలను కాపాడాలని, రైతులకు నష్టం కలిగించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.
సచివాలయ ప్రాంగణంలో రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తిచేశారు. ఈ అంశంపై శాసనమండలిలో లేవనెత్తేందుకు చైర్మన్ అనుమతిని కోరారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించి, స్థలాన్ని కూడా కేటాయించిందని తెలిపారు. పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయలేదని వివరించారు. ఆ స్థలంలో రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని అభ్యంతరం వ్యక్తంచేశారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్గాంధీ పట్ల తమకు అపారమైన గౌరవం ఉన్నదని, కానీ తెలంగాణతల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.