MLC Kavitha | కామారెడ్డి : రాష్ట్రంలోని రైతులకు మర్యాద తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సదాశివనగర్ మండలం పద్మాజివాడలో నిర్వహించిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ రాకముందు రైతుల ఆత్మహత్యలు ఉండేవి అని కవిత గుర్తు చేశారు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు లేవని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు లేవు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని చెప్పారు. విత్తనాలు, ఎరువుల కొరత లేనే లేదు. కరెంట్ సమస్యలు కూడా లేవని స్పష్టం చేశారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నామని కవిత పేర్కొన్నారు. దీంతో భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. వరిసాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. రైతుల కోసం సంఘాలు పెట్టిన ఘనత కేసీఆర్దే అని స్పష్టం చేశారు. రైతులు లాభదాయకమైన పంటలవైపు దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ సూచించారు.
సరిహద్దు జవాన్.. పంట పొలంలో రైతు.. ఇద్దరి వల్లే మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం అని కవిత పేర్కొన్నారు. రైతుకు మర్యాద తెచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు. రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతకు అండగా ఉన్నామని స్పష్టం చేశారు. వ్యవసాయం అంటే దండగ అన్న స్థితి నుంచి పండగ అనే స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రం రాక ముందు రైతు అంటే అప్పులు అడుగుతారని అనుకునేవారు.. కానీ కేసీఆర్ రైతులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు అని కవిత పేర్కొన్నారు.