సంగారెడ్డి : గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బల్కంచెలక తండాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో కవిత పాల్గొన్నారు. అంతకు ముందు కవితకు గిరిజన సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సేవాలాల్ గిరిజన, ఆదివాసీ జాతిని మొత్తాన్ని జాగృతం చేశారన్నారు. సేవాలాల్ మహరాజ్కు భారత రత్న ఇవ్వాలని తాను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు.
దేశంలోనే సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనన్నారు. 84 కులాలకు హైదరాబాద్లో స్థలాలు కేటాయించి.. ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి ద్వారా గిరిజనులకు ఆడబిడ్డలకు సహాయం చేస్తూ.. మేనమామగా చూసుకుంటున్నారని, తెలంగాణలో 3వేల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. తీజ్ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రతిపాదన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉండి పండుగలు చేసుకుంటున్నామన్నారు.