పటాన్ చెరు : తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలంవీరులు సీఎం కేసీఆర్తో నడిచారని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పటాన్ చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ద్వితీయ మహాసభలు, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) 10వ ప్లీనరీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మీడియా సంస్థల విశ్వసనీయతతో పాటు, ప్రసారం చేస్తున్న వ్యక్తులకు సైతం నిబద్ధత ఉన్నప్పుడే, ప్రసారం చేసే వార్తలపై విశ్వాసం కలుగుతుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
సమాజంలో వార్తల మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పుకోవడం బాధాకరమన్నారు. కొన్ని సంస్థలు కావాలనే తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి కుట్రలపై జర్నలిస్టులు సైతం ఆలోచించాలని సూచించారు. గత తొమ్మిదేండ్లలో ప్రధాని మోదీ ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదన్న ఎమ్మెల్సీ, దీనిపై ఒక్క జర్నలిస్టు యూనియన్ కూడా ప్రశ్నించలేదన్నారు. సీఎం కేసీఆర్ వందలాది మంది జర్నలిస్టులతో మీడియా సమావేశం నిర్వహించి, విలేఖరులు అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతూ.. సమస్యలకు పరిష్కారం చూపిస్తారని పేర్కొన్నారు.
రాజకీయ నేతలకు పారదర్శకత, నిబ్ధత ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రం జర్నలిస్టులకు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లుగానే, కేంద్ర ప్రభుత్వం సైతం జర్నలిస్టులకు నిధులు కేటాయించేలా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) డిమాండ్ చేయాలని, బీఆర్ఎస్ పార్టీ సైతం మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. జర్నలిస్టుకు ఇండ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.