MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులపై తీవ్రంగా స్పందించారు. అన్ని పింక్బుక్లో రాసుకుంటున్నామని.. అధికారంలోకి వచ్చాక అన్నీ తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసునని.. మీ లెక్కలు తీస్తామన్నారు. జనగామలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారన్నారు. పోస్టు చేసిన మరుసటి రోజే ఇంటికి పోలీసులు వచ్చి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతుంటారని.. కానీ, తెలంగాణలో రేవంత్రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం అన్నారు. కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు, నిధులు పారాయన్నారు. కేసీఆర్ ఉద్యమానికి భయపడి 2001లో ఆఘమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారని. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారని గుర్తు చేశారు. పూర్తయిన సమ్మక్క సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమని.. కేవలం 5శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. అవకాశవాదం కోసం కడియం పార్టీ మారారని మండిపడ్డారు. ఆయనను ప్రజలు క్షమించే ప్రస్తకే లేదన్నారు.
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని.. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుందన్నారు. రూ.2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలను వేధిస్తోందని ఆరోపించారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు మాయమయ్యాని ఆరోపించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదని, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందేనన్నారు.
ఆడబిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. విదేశీ సాల్కర్షిప్ నిధులను సైతం విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట రైతులను మోసం చేస్తుందన్నారు. రుణమాఫీ అందరికీ కాలేదని, కానీ పూర్తయిందని గొప్పలు చెప్పుకుంటుదన్ని రేవంత్ సర్కారు అంటూ ధ్వజమెత్తారు. సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదని.. కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడుతామని స్పష్టం చేశారు.