హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఉప్పల్ అబాకస్ ఐటీ పార్క్లో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత శనివారం ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఐటీ రంగాన్ని హైదరాబాద్లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. అందులో భాగంగా ఉప్పల్ కారిడార్లో అనేక ఐటీ పరిశ్రమలు నెలకొల్పుతుండటంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఐటీ పరిశ్రమలు నెలకొల్పే దిశగా మంత్రి కేటీఆర్ యువతను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. కంపెనీ స్థాపించి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ యాజమాన్యాన్ని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ రోజు ప్రారంభించిన కొత్త కంపెనీలో దాదాపు 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.