MLC Kavitha | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. గురువారం ఆమె ఎన్డీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. దేశంలో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారని, అయితే దేశవ్యాప్తంగా అన్ని చోట్లా కాంగ్రెస్కు బలం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కలిపి దేశంలో 2వేల ఎమ్మెల్యే స్థానాలు కూడా లేవని, మిగతా స్థానాలు ప్రాంతీయ పార్టీల చేతిలో ఉన్నాయని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే తామే ప్రతిపక్ష పార్టీలకు నేతృత్వం వహిస్తామని కాంగ్రెస్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఖమ్మంలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి ఆవిర్భావ సభకు బిజీ షెడ్యూల్ వల్లే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ను ఆహ్వానించలేదని కవిత పేర్కొన్నారు. ఏప్రిల్ 14న జరిగే సభకు మమతా బెనర్జీకి ఆహ్వానం వెళ్లిందో, లేదో తనకు తెలియదని చెప్పారు. మమతా బెనర్జీతో తమకు విభేదాలేమీ లేవని స్పష్టంచేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం రావాలని ఆకాంక్షించారు. దేశంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని, పవన్ ఖేర అరెస్టు ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. హిండెన్బర్గ్ నివేదికపై బీజేపీ సర్కారుకు భయమెందుకని ప్రశ్నించారు. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత కొంత మందిని కాపాడేందుకే మోదీ.. ప్రధాని పదవిని చేపట్టినట్టుగా ప్రజలు చెప్పుకొనేస్థాయికి చేరుకొన్నారని విమర్శించారు. ఈడీ, సీబీఐ దాడులతో ప్రతిపక్షాలను భయపెడుతున్న కేంద్ర సర్కారు.. అదానీపై కూడా ఇలాంటి చర్యలే తీసుకొంటుందా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. దేశంలో గుజరాత్ మాడల్ ఫెయిల్ అయిందని, అందుకే తెలంగాణ మాడల్ను ప్రజలు కోరుకొంటున్నారని చెప్పారు. ఇందుకోసమే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చామని స్పష్టం చేశారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు, విపక్షాలను కలుపుకొని బీజేపీని నిలువరించేగల సత్తా బీఆర్ఎస్కు ఉన్నదని పేర్కొన్నారు.