హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండపడ్డారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని బాధపడ్డారు. ప్రవళిక ఆత్మహత్యపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన ట్వీట్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్టు రేవంత్రెడ్డి వ్యవహారశైలి ఉన్నదని విమర్శించారు. రేవంత్ ఆవేదన బూటకం, కాంగ్రెస్ ఆందోళన నాటకం అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘మేము బతుకమ్మ చేస్తాం. బాధను కూడా పంచుకుంటాం. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం కాంగ్రెస్కు మాత్రమే సాధ్యం’ అని ట్వీట్ చేశారు. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం కాంగ్రెస్ విధానమా? అని ప్రశ్నించారు. నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.
తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ జారీ అయినా దానిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కుట్రలను బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అని స్పష్టం చేశారు. గ్రూప్- 2 పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీధర్బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడం, రేవంత్రెడ్డి ట్వీట్లో చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.