హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం లక్ష్యానికి రాష్ట్రంలోని కాంగ్రస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఈ పథకం కింద స్కాలర్షిప్ నిధులను విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ విద్యకు పేద విద్యార్థులను దూరం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులతో శనివారం ఏర్పాటుచేసిన జూమ్ మీటింగ్లో కవిత మాట్లాడారు.
ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు విదేశీ విద్య అందాలన్నది కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. రెండో విడత నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలని సర్కార్ను నిలదీశారు.
స్కాలర్షిప్ అందక అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారంతా స్కాలర్షిప్ల కోసం ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేస్తున్నదని, కానీ పేద విద్యార్థుల చదువులకు మాత్రం బకాయిలు చెల్లించడం లేదని మండిపడ్డారు. ఈ పథకంతోపాటు రాష్ట్రంలోని ఇతర స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం మొద్దునిద్రను వీడి తక్షణమే విద్యార్థుల ఫీజు బకాయిలను నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు.