హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మూడోవంతు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ జంతర్మంతర్ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టనున్నారు. ఒకరోజు చేపట్టే ఈ ధర్నాను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. ధర్నాలో జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాతోపాటు దేశంలోని వివిధ పార్టీల నేతలు పాల్గొననున్నారు. ముగింపు కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా హాజరవుతారు. ఈ కార్యక్రమానికి 18 రాజకీయ పార్టీల నేతలు, దేశంలోని అన్ని రాష్ర్టాల మహిళా సంఘాల, మహిళా హక్కుల సంస్థల ప్రతినిధులు తరలివచ్చి కవితకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించనున్నారని భారత జాగృతి వర్గాలు తెలిపాయి.