హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): బీసీ కులగణనపై బీజేపీ వైఖరి ఏంటో స్పష్టంచేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీసీలంటే బీజేపీకి లెకలేదా? అని నిలదీశారు. గురువారం శాలివాహన, ఆరెకటిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో కలిశారు. బీసీలు, బీసీ కులవృత్తులవారు ఎదురొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గత సీఎం కేసీఆర్ కులవృత్తులకు అన్నివిధాలా అండగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను కుదేలు చేస్తున్నదని మండిపడ్డారు. బీసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నా బీజేపీ స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
బీసీలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు అవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం సరికాదని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకురావాలని, లేకుంటే బీసీలపై ఆ పార్టీకి ప్రేమ లేనట్టేనని పేర్కొన్నారు. సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు బొల్ల శివశంకర్, రాష్ట్ర శాలివాహన సంఘం నాయకులు దుగుంట్ల నరేశ్, నిమ్మలూరి శ్రీనివాస్, రేపాక రాంబాబు, రావులకోల్, రాష్ట్ర ఆరెకటిక సంఘం నాయకులు హకీంకారి సురేందర్, జీకే జహంగీర్, జీకే పరమేశ్వర్, వెంకటేశ్వర్, జీకే అఖిలబాయి తదితరులు పాల్గొన్నారు.