మహబూబ్నగర్, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంగమేశ్వరం వద్ద పర్మిషన్ లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతుంటే నాటి సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని, ఇప్పుడు ఇదే జిల్లా నుంచి సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకోవాలని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహబూబ్నగర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి మంగళవారం కవిత విలేకరులతో మాట్లాడారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే మొదట నష్టపోయేది పాలమూరు జిల్లానే అని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేండ్లు ప్రాజెక్టును కట్టేందుకు ఏపీ ప్రభుత్వం ధైర్యం చేయలేదని చెప్పారు. ఈ ఎత్తిపోతలకు కొద్ది దూరంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(పీఆర్ఎల్ఐ)ను నిర్మించామని అన్నారు. 90 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్టుకు రీటెండరింగ్ను కట్టిపెట్టి మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. టెండర్లను ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ప్రాజెక్టు పరిస్థితి ‘ఏనుగు ఎల్లింది.. తోక చిక్కింది’ అన్నట్టు ఉ న్నదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీల అమలుకు, ప్రజల హక్కులను సాధనకు బీఆర్ఎస్ పార్టీ పోరా టం చేస్తూనే ఉంటుందని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జనవరి 1వ తేదీన ఇవ్వాల్సిన పింఛన్లను ఇప్పటివరకు పంపిణీ చేయలేదన్నారు.
కాంగ్రెస్ సర్కారు తమపై కోపంతో జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. మహబూబ్నగర్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న దవాఖాన పనులు నిలిపివేశారని తెలిపారు. మన్యంకొండలో మండపాలు కూడా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి పీ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, నేతలు కృష్ణమోహన్, మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు.