హైదరాబాదాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘మహిళలే దేశాన్ని నడిపే నవశక్తులు’.. ఇది ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మహిళా సాధికారత, మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే (2014 జూన్ 14) చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించి తన చిత్తశుద్ధిని చాటుకొన్నారు.
అన్ని పార్టీ సమావేశాల్లోనూ మహిళా బిల్లుపై చర్చించి, అందుకోసం పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ బిల్లు కోసం అలుపెరగని పోరాటం చేశారు. మహిళా దినోత్సవం రోజున ఢిల్లీలోని జంతర్మంతర్వద్ద నిరాహారదీక్ష నిర్వహించి, యావత్తు దేశ మద్దతును కూడగట్టారు. ఈ పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించడంతో తెలంగాణలో సంబురాలు అంబరాన్నంటాయి.
బీఆర్ఎస్ అలుపెరగని పోరు
మహిళా రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపి ఊరుకోకుండా సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఈ విషయాన్ని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో పెట్టి, ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రతీ పార్లమెట్ సమావేశాల సందర్భంగా కేంద్రానికి నివేదిస్తూనే ఉన్నది. బీఆర్ఎస్ ఎంపీలు ఈ బిల్లు కోసం పట్టుబడుతూనే ఉన్నారు.
ఒకవైపు రాజ్యాంగబద్ధమైన వేదికల మీద ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీగా ప్రతి ఏటా మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి దాకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మహిళా వారోత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్న విషయమూ తెలిసిందే.
బిల్లు కోసం కవిత ఉద్యమం
చట్టసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా 2023 మార్చి 8న ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా ధర్నా నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మినహా ఈ ధర్నాకు దేశంలోని 18 రాజకీయ పార్టీలు తమ సంఘీభావం ప్రకటించాయి. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ రెండు సార్లు మహిళా బిల్లు తెస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పటి వరకు తేలేదని ఎమ్మెల్సీ కవిత కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ పట్ల మోదీకి, బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బిల్లు తేవాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అండగా నిలిచారు. 28 రాష్ర్టాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తున్న మహిళా సంఘాలు, ఎన్జీవో సంఘాల ప్రతినిధులు వందలాదిగా ధర్నా శిబిరానికి తరలివచ్చి కవితకు సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసి మహిళా బిల్లుపై కేంద్రంపై ఒత్తిడి పెంచే క్రమంలో సహకరించాలని ఆమె కోరారు.
చారిత్రక పాత్ర పోషించాలని కవిత లేఖలు
ఈ నెల 18 నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమాశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని రాజకీయ పార్టీలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, మహిళా బిల్లు చారిత్రక అవసరమని, చట్టసభల్లో సరిపడా మహిళల ప్రాతినిధ్యం ఉంటేనే దేశం పురోగమిస్తుందని స్పష్టం చేస్తూ ఈనెల 5న దేశంలోని కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం సహా అన్ని రాజకీయ పార్టీల, దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల అధ్యక్షులకు, ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.
ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయత్వంలో పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశాలు, పార్టీ సమావేశాలు, పార్టీ ప్లీనరీల్లోనూ మహిళా సంక్షేమం విషయంలో చర్చ జరిగిన ప్రతీ సందర్భంలోనూ మహిళా బిల్లుపై కేంద్రానికి ప్రత్యేక తీర్మానాలు చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన జరిగిన పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం బిల్లును తెచ్చి ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానిమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
మహిళా సాధికారతకు కేసీఆర్ పెద్దపీట
‘అబలయని దేశమును
కబళింప తలపడిన
పరరాజులకు స్త్రీల
పటుశౌర్యమును చూపి
రాజ్యతంత్రము నడిపెరా
తెలంగాణ రాణిరుద్రమదేవిరా..’
తెలంగాణ చైతన్యానికి ఇది మచ్చుతునక. రాజ్యతంత్రం నడపటంలోనే కాదు రాజ్యాన్ని ధిక్కరించటంలోనూ దేశంలో తెలంగాణది ఆది నుంచి విలక్షణ గడ్డ. దేశంలో ప్రజారంజకపాలనను అందించిన కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రాణిరుద్రమదేవి నుంచి మొదలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దాకా మహిళాశక్తికి ప్రతీకగా తెలంగాణ నిలిచింది. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మహిళా సాధికారత, మహిళలకు సమాన హక్కులు కల్పించటం కోసం అనేక రూపాల్లో పోరాటాలను రూపొందించారు. మరుగున పడిన మన వీరవనితలకు సముచిత ప్రాధాన్యత కల్పించారు.
తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయిన తర్వాత మహిళాభ్యుదయం, సాధికారత కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి, అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్యలక్ష్మి, వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక పథకాలైన కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్, సంక్షేమంలో స్వర్ణమకుటమైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్, బీడీ కార్మికుల ఆసరా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు సరఫరా చేయటమే కాకుండా స్థానికసంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం వంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
మహిళా రిజర్వేషన్ కోసం దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు తేవాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లు మరోసారి పార్లమెంట్లో కాలుమోపడంలో పార్టీగా బీఆర్ఎస్, మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషి ఎంతో ఉన్నది. కవిత.. ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర ధర్నా చేయటమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావటానికి విస్తృత కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే. దశాబ్దాల నిరీక్షణ అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే మోక్షం లభించటంతో మహిళాలోకం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.