హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో(Singareni elections) తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తెలిపారు. ఈ మేరకు కవితశుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) హయాంలో సంస్థ కోసం, కార్మికుల సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటేసి టీబీజీకేఎస్ సంఘాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఎదుగుదలకు, సంస్థను లాభాల బాట పట్టించేందుకు, కార్మికుల సంక్షేమానికి నాడు కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని గుర్తు చేశారు.
సింగరేణి సంస్థను కేసీఆర్ కాపాడారని, టీబీజీకేఎస్ కార్మికుల హక్కులను సాధించిందని పునరుద్ఘాటించారు. కార్మికుల గొంతుక టీబీజీకేఎస్ బాణం గుర్తుపై ఓట్లేసీ భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో దాదాపు 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని వివరించారు. డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు చెల్లించాలన్న ఉదారమైన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని ప్రస్తావించారు.
కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిననాటికి లాభాల్లో కార్మికులకు వాటా కేవలం18 శాతంగా ఉండేదని, దాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 32 శాతానికి పెంచారని చెప్పారు.
తద్వారా కార్మికుల కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం లభించిందని తెలియజేశారు. అంతేకాకుండా, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ దవాఖానల్లో ఉచితం వైద్య సౌకర్యం కల్పించారని, సొంత ఇల్లు నిర్మించుకునే వారికి రూ.10 లక్షల మేర రుణం వరకు సంస్థనే వడ్డీ భరించడం, ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేయడం వంటి విప్లవాత్మకమైన కార్మిక సంక్షేమ నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారని కవిత వివరించారు.
టీబీజీకేఎస్ ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం టీబీజీకేఎస్ అని తేల్చిచెప్పారు. సంఘం నాయకత్వ బాధ్యతల్లో యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత పదేళ్ల కాలంలో ఒక్క సమ్మె కూడా చేయనవసరం లేకుండా అన్ని పనులను, డిమాండ్లను సాధించుకున్నామని కవిత గారు పేర్కొన్నారు.