హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వార్ వన్సైడేనని, బీఆర్ఎస్ భారీ మెజార్టీతో మూడోసారి అధికారంలోకి రాబోతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొడతారని చెప్పారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి సోలాపూర్ వెళ్లిన కవిత స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. పదేండ్లలో రైతులు, మహిళలు, యువత, ఎస్సీ ఎస్టీ, బీసీ సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేసిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయని అన్నారు. సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ అన్నీ సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని జోస్యం చెప్పారు.
బీఆర్ఎస్ పథకాలను కాపీ కొట్టి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ఏ నాయకుడు గ్యారెంటీ ఇస్తారని కవిత ప్రశ్నించారు. దళిత నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాదని గాంధీ కుటుంబం గ్యారెంటీల హామీలు ఇస్తున్నదని విమర్శించారు. తెలంగాణ సంస్కృతిని మహారాష్ట్రలో కొనసాగించడం సంతోషంగా ఉన్నదని, మహారాష్ట్ర సంస్కృతిని కూడా పాటిస్తూ అకడ తెలంగాణవాసులు గంగా జమున తహజీబ్లా కలిసిపోయారని హర్షం వ్యక్తం చేశారు.
సోలాపూర్ పర్యటనలో భాగంగా ఎమ్మె ల్సీ కవిత చేనేత పరిశ్రమలను సందర్శించి, కార్మికులతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు ఎటువంటి సహాయ సహకారాలూ అందించడం లేదని వారు కవిత దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సోలాపూర్లో పెద్ద సంఖ్యలో ఉన్న బీడీ కార్మికులను కలిసి, కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. సోలాపూర్లో దాదాపు 70 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారని, మహారాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని వారు కవిత దృష్టికి తీసుకొచ్చారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి సోలాపూర్ వచ్చిన కల్వకుంట్ల కవితకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పుంజల్మైదాన్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. సోలాపూర్లో మధ్యాహ్నం నగేశ్వాల్యాల్ నివాసంలో బతుకమ్మను పేర్చారు. అనంతరం దశరథ్ గోప్ నివాసానికి వెళ్లారు. దత్త మందిర్ నుంచి మొదలైన బతుకమ్మ ర్యాలీలో కవిత మహిళలతో కలిసి నడిచారు.