బాన్సువాడ : పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని అనేక మంది మాటలు చెప్పారు తప్ప, పల్లెల కోసం ఎవరూ ప్రణాళిక వేసుకొని పనిచేయలేదు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో.. సీఎం కేసీఆర్ పట్టుదలతో పల్లెల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి ప్రారంభించారని కవిత తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు.
కరోనా కారణంగా కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. అయినా కూడా, పెన్షన్, రైతు భీమా, రైతు బంధు, లాంటివి ఎక్కడా ఆగలేదని కవిత స్పష్టం చేశారు. కరోనాతో మూడేండ్లు ఇబ్బంది పడ్డా, ఒక్క పూట కూడా మిషన్ భగీరథ నీళ్లు ఆగలేదు. ఒక్కపూట కూడా కరెంటు పోలేదు. రైతు బంధు, పెన్షన్ ఆగలేదు. ఇది కేవలం మన నాయకుడి పట్టుదలతోనే సాధ్యమైంది. ఒక ఇళ్లు ఎలా పరిశుభ్రంగా ఉంటుందో, పల్లె కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ భావించారు. అందుకనుగుణంగా పల్లెల అభివృద్ధికి చర్యలు తీసుకుంటూ, అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు నెలనెలా ఠంచన్గా డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. పల్లెలను బాగు చేసే కార్యక్రమం దేశం మొత్తంలో కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతుందన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కళ్ల ముందు కనబడుతుందన్నారు.