MLC Kavitha | రాజకీయ కోణంలో కేసుల నమోదు.. విచారణ పేరుతో ఢిల్లీకి పిలవడం.. గంటల తరబడి ఆఫీసులో కూర్చోబెట్టడం.. వ్యక్తిత్వ హననం చేసేలా లీకులు ఇవ్వడం.. బురద పూసి కడుక్కోమనడం.. ఇదీ గత కొన్నాళ్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుసరిస్తున్న దర్యాప్తు విధానం.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ప్రతిపక్షాలకు చెందిన అనేక రాజకీయ నాయకులు ఈ తంతుకు గురయ్యారు.. గురవుతున్నారు.
ఈ విషయంలో ఈడీకి బహుశా మొట్టమొదటిసారి ఎదురుప్రశ్న ఎదురైంది. ఈడీ వ్యవహారశైలిని భారత జాగృతి సారథి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిలదీసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘నన్ను ఏ ప్రాతిపదికన విచారణకు పిలిచారు? నేను నిందితురాలినా? ఢిల్లీ ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంతో అధికారికంగా మద్యం విధానాన్ని మార్చుకుంటే దాంతో నాకేంటి సంబంధం? ఇలా రాజకీయ కోణంలో మీరు ఎంతమందిని విచారణకు పిలుస్తారు? గతంలో విపక్షంలో ఉన్న హిమంత బిశ్వశర్మ, నారాయణ్ రాణె, సుజనా చౌదరిలపై ఈడీ పెట్టిన కేసులు ఏమయ్యాయి? వారు బీజేపీలో చేరగానే విచారణ ఎందుకు ఆగిపోయింది? విచారణ పేరుతో పిలిచి గంటల తరబడి ఒంటరిగా గదిలో కూర్చోబెట్టి మానసికంగా ఒత్తిడి చేస్తే లొంగిపోతామనుకుంటున్నారా? అసలు రాజకీయనాయకులపై మీరు పెడుతున్న కేసులెన్ని? వాటిలో ఎన్నింటిని రుజువు చేయగలిగారు?’.. ఇలా కవిత ప్రశ్నల పరంపర సంధిస్తే ఈడీ అధికార్లనుంచి నీళ్లు నమలడమే జవాబైంది.
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): తాను ఏ తప్పూ చేయలేదని, కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారిస్తున్నారని భారత జాగృతి సారథి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి స్పష్టంచేసినట్టు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైన కవిత విచారణ సందర్భంగా అధికారులను పలు అంశాలపై నిలదీసినట్టు తెలుస్తున్నది. ఈడీ దర్యాప్తులో నిష్పాక్షికత, పారదర్శకత కనిపించడం లేదని, రాజకీయ కుట్రలో పాలుపంచుకుంటున్నట్టు కనిపిస్తున్నదని ఆమె కుండబద్ధలు కొట్టడంతో నీళ్లు నమలడం అధికారులవంతయ్యింది. తప్పుడు విషయాలు లీక్ చేస్తుండటంపైనా అధికారులను కవిత ప్రశ్నించారు. తాను నిందితురాలినా? అని కవిత నిలదీయగా.. కాదంటూ దర్యాప్తు బృందం సమాధానమిచ్చింది.
కేవలం అనుమానితురాలిగానే ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత నుంచి రాత్రి 9.30 వరకు అధికారులు వివరాలు సేకరించారు. అయితే కవిత ఈడీ ఆఫీసుకు వచ్చిన తర్వాత గంటవరకు దర్యాప్తు అధికారులు ఆమెను ప్రశ్నించలేదని తెలిసింది. ఇతర నిందితుల సమక్షంలో ముఖాముఖి ప్రశ్నలు అడుగుతున్నట్టు ఈడీ అధికారులు బయటకు లీకులు వదిలినప్పటికీ.. కవితను మాత్రం ఇంతవరకు ఎవరితోనూ కన్ఫ్రంటేషన్ చేయలేదు. ఆమెను విడిగానే విచారించారు. అయితే మొత్తం 11 గంటల్లో కేవలం 14 ప్రశ్నలు మాత్రమే ఈడీ బృందం కవితను అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎక్కువ సమయం ఖాళీగా కూర్చోబెట్టినట్టు అర్థమవుతున్నది. స్పష్టమైన ఆధారాలేవీ లేకపోవడంతో మానసికంగా వేధించేందుకే ఈడీ అధికారులు ఇలా చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతున్నది. మద్యం పాలసీ కేసులో కవిత ప్రమేయానికి సంబంధించి ఏ ఒక్క అధారాన్నీ విచారణలో అధికారులు చూపెట్టలేకపోయారని సమాచారం. కేవలం రాజకీయ అంశాల చుట్టూ ఈడీ ప్రశ్నలు కొనసాగాయని తెలుస్తున్నది.
ఇది కేవలం రాజకీయ కుట్ర
తాను ఎలాంటి తప్పూ చేయలేదని, చేయనని ఈడీ దర్యాప్తులో కవిత స్పష్టంచేశారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తనను దురుద్దేశంతో విచారిస్తున్నారని ఆమె ఈడీ అధికారులతో కుండబద్ధలు కొట్టారు. తాను పూర్తిస్థాయిలో విచారణకు సహకరిస్తున్నప్పటికీ.. సహాయ నిరాకరణగా చిత్రీకరించేందుకు ఈడీ కుట్ర పన్నుతున్నదని ఆమె ఆరోపించారు. విచారణలో పారదర్శకత లోపించిందని, రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనను విచారిస్తున్నట్లు తెలుస్తున్నదని కవిత నిలదీయగా.. ఈడీ అధికారులు మౌనంగా ఉండిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏ అక్రమాల్లోనూ తన పాత్ర లేకపోయినా కల్పిత కథలతో తనపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారని సమాచారం. తమ విశ్వసనీయత తమకు ఉన్నదని కవిత స్పష్టంచేశారు. ఈడీ విచారణలో పారదర్శకత లేదని పలుమార్లు తేల్చిచెప్పిన కవిత.. అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని విచారణ అధికారుల మొహం మీదే చెప్పినట్టు రాజకీయవర్గాలు తెలిపాయి.
ఈడీ అధికారులకే ప్రశ్నల వర్షం
విచారణ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులను పలుమార్లు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఆమె ప్రశ్నలకు పలుమార్లు నీళ్లు నమిలిన అధికారులు.. ఎక్కువసార్లు మౌనంగానే ఉండిపోయారని సమాచారం. తనను నిందితురాలిగా పిలిచారా? అని విచారణ బృందాన్ని కవిత ప్రశ్నించగా.. వాళ్లు కాదు అని సమాధానమిచ్చారు. కేవలం అనుమానితురాలిగానే ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్పై ఈ నెల 24న విచారణ ఉండగా.. తనను అంత తొందరగా విచారించాల్సిన అవసరమేమిటని కవిత ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈడీ అధికారుల నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని సమాచారం. గత విచారణలో స్వాధీనం చేసుకున్న తన ఫోన్ను పూర్తిగా చెక్ చేసుకోవచ్చునని అధికారులకు తేల్చిచెప్పిన కవిత.. తాను ఫోన్లు ధ్వంసం చేసినట్టు మీడియాకు తప్పుడు లీకులు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. కవిత ప్రశ్నతో ఈడీ అధికారులు కంగుతిన్నారు.
విచారణ రికార్డు చేయాలని కవిత ఒత్తిడి
ఈడీ విచారణను పూర్తిగా రికార్డు చేయాలని ఎమ్మెల్సీ కవిత అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీంతో ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేపట్టారు. విచారణ సందర్భంగా పలు ఈడీ కేసులపై కవిత అధికారులను ప్రశ్నించారు. బీజేపీలో చేరగానే మరుగునపడిన కేసుల గురించి ఆమె ప్రస్తావించడంతో అధికారులు మూగబోయారు. ‘గతంలో ఎంతోమందిపై విచారణ చేపట్టారు. బీజేపీలోకి రాగానే వారిపై ఎందుకు విచారణను ఆపేశారు? వారిపై పెట్టిన కేసులు ఏమైనయ్? ఇప్పటివరకు ఈడీ పెట్టిన కేసులెన్ని? వాటిలో దోషులుగా తేలినవి ఎన్ని?’ అని కవిత నిలదీసినట్టు సమాచారం. ఈ సందర్భంగా హిమంత బిశ్వశర్మ, సుజనాచౌదరి, నారాయణ రాణె కేసులను ఆమె ప్రస్తావించగా.. వాటిపైనా ఈడీ అధికారులు మౌనంగానే ఉండిపోయారని తెలుస్తున్నది.