MLC Kavitha | హైదరాబాద్: మాటలు చెబుతున్నది ఎవరో.. చేతలు చేస్తున్నది ఎవరో గమనించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. `ఇదం బ్రహ్మం.. ఇదం క్షాత్రం అంటాం. అవసరమైనప్పుడు వేదం చదవాలి....అవసరమైతే గాండీవం ఎత్తాలి. అటువంటి సందర్భం, సమయం, అటువంటి స్పూర్తి మనం అలవర్చుకోవాలి. విజ్ఞత ప్రదర్శించాలి. ఎందుకంటే మాటలు చెబుతున్నదెవరు...చేతలు చేస్తున్నదెవరు అన్నది గమనించాలి. ఒక హంసలాగా పాలెంటి... నీళ్లేంటి అన్న విషయాన్ని విడగొట్టి చూడగలగాలి`
అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ స్పూర్తితో ఎన్ని రాష్ట్రాల్లో బ్రహ్మణులకు మంచి జరుగుతదన్న విషయాన్న ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఆదివారం హైదరాబాద్లో విభ్రహిత భవనం ప్రారంభించారు. ఈ భవన ప్రారంభానికి దాదాపు 20 రాష్ట్రాల నుంచి బ్రహ్మణులు ఆశీర్వాదాలు పంపారని తెలిపారు. తమ తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి పథకాలను రాబట్టుకుంటామని ఆయా రాష్ట్రాల బ్రాహ్మణులు అన్నారన్నారు. ఇంత స్పూర్తిదాయక ప్రభుత్వం నడుపుతున్న సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలన్నారు. ఈ సందర్భంగా జరిగిన బ్రహ్మగర్జన సభలో ఆమె మాట్లాడారు.
తమది సంస్కృతి , సంప్రదాయాలు కలిగిన కుటుంబమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అపారమైన జ్ఞానం, భాషపై పట్టు ఉన్నా తక్కువ మంది బ్రాహ్మణుల వద్ద ఆస్తులు, భూములు ఉంటాయని, దాంతో కేవలం పౌరోహిత్యంపై ఆధాపడి జీవిస్తుంటారన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో, విప్లవోద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించినా బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తున్న విషయం వాస్తవమేనని చెప్పారు.
కానీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఉన్న చోటల్లా బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. భవిష్యత్లోనూ మరిన్ని అవకాశాలు కల్పించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. స్వాతంత్రం వచ్చిన 75 ఏండ్లలో ఏ ప్రభుత్వం కూడా బ్రహ్మణులకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడడంలో బ్రహ్మణుల పాత్రను బీఆర్ఎస్ పార్టీ గుర్తించిందని, దైవ కృప, బ్రహ్మణుల ఆశీర్వాదం లేకపోతే రాష్ట్రం వచ్చేది కాదన్నది వాస్తవమని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో గుడి బంద్ పెట్టడాన్ని తాము ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. తమతో పాటు నిరాహార దీక్షల్లోనూ అర్చకులు పాల్గొన్నారని గుర్తు చేశారు.
సమాజానికి జ్ఞానజ్యోతిని పంచే బ్రాహ్మణుల ప్రకాశాన్ని మరింత పరివ్యాప్తం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. అర్చకులకు జీతాలు ఇవ్వడం, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు దూపదీప నైవేధ్యానికి రూ. 2500 నుంచి రూ. 10 వేలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని వివరించారు. దూపదీప నైపధ్యం కింద రాష్ట్రంలోని ఆరు వేల దేవాలయాలకు డబ్బు ఇస్తున్నారని, వాటిని 8 వేల దేవాలయానికి విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకునే ప్రభుత్వాలు తిరిగి దేవాలయాలకు ఇవ్వవని దేశవ్యాప్తంగా అనేక మంది ఆవేదన చెందుతుంటారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కానీ తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక చిన్న చిన్న దేవాలయలకు కలిపి రూ. 2242 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. పెద్ద పెద్ద దేవాలయాల విషయంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి రూ. 1200 కోట్ల, కొండగట్టు అంజన్న స్వామి దేవాలయానికి రూ. 500 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో దాదాపు 1600 దేవాలయలకు రూ. 10 వేల నుంచి రూ. 5 లక్షల వరకు బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎంత చేసినా చేయాల్సింది చాలా ఉంటుందని, కాబట్టి భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బ్రహ్మణ విద్యార్థులను ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సివిల్ సర్విస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే బ్రహ్మణ విద్యార్థుల కోసం కోచింగ్ ఇచ్చే ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని, విదేశీ విద్య కోసం ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఇస్తోందని, దాదాపు 750 మంది విద్యార్థులు ఇప్పటికే లబ్ధి పొందారని అన్నారు. ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో ఐఐటీ, ఐఐఎం సీట్లు సాధించిన విద్యార్థులకు కూడా వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ మేరకు ప్రభుత్వంలో పని జరుగుతోందన్నారు.
రాష్ట్రంలో బ్రహ్మణులను హేళన చేయడం, ఇబ్బంది పెట్టడం వంటి సంఘటనలు తమ పార్టీ నాయకుల దృష్టికి వస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఎవరు ఎవరినీ కూడా హేళన చేస్తే సహించే ప్రభుత్వం కాదని, అందరి రక్షణ తమ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ భాషను, యాసను అవహేళన చేసినప్పుడు తెలంగాణ జాగృతి గళమెత్తిన సంగతి గుర్తు చేశారు.