హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినాతో ఎమ్మెల్సీ కవిత ఫోన్లో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సౌకర్యం, ఇతర మౌళిక సదుపాయాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వర కార్యచరణ రూపొందించాలని ఎమ్మెల్సీ కవిత ఆదేశించారు.
నందిపేట్, సిరికొండ, బోధన్ నియోజకవర్గాలకు మంజూరు చేసిన ప్రత్యేక అంబులెన్స్ లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కవిత సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వరదముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన ఆఫీసర్ క్రిస్టినా మధ్యాహ్నం నిజామాబాద్ లో పర్యటించనున్నారు.