మునుగోడు: కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి ఓటేస్తే మోరీలో వేసినట్లేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయాలు చేస్తూ ఉపఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మునుగోడు మండలంలోని ఊకొండి గ్రామంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉపఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు తెచ్చుకున్నట్టేనని చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తున్నదని తెలిపారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, దివ్యాంగులకు రూ.3016 పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాంతం నుంచి ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టామని చెప్పారు.
కాంట్రాక్టు కోసం పార్టీ మారడంతో వేల కోట్ల లబ్ధి పొందిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు డబ్బు మూటలతో వచ్చి గెలిచేందుకు చూస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో గెలిచి మూడేండ్లపాటు కంటికి కనబడకుండా పోయాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని, ప్రతిపక్షం నుంచి మరో ప్రతిపక్ష పార్టీలో చేరితే ఏం లాభమన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.